హెచ్1బీ వీసా: ట్రంప్ చర్యలకు విరుగుడు ఇదే...
‘అమెరికా ఫస్ట్’ నినాదంతో విదేశీయులను ప్రత్యేకించి భారతీయ నిపుణుల రాకను నిరోధించేందుకు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు భారత్, ఐటి ఇండస్ట్రీ బాడీ నాస్కమ్ చర్యలు ప్రారంభించాయి.
న్యూఢిల్లీ / వాషింగ్టన్: 'అమెరికా ఫస్ట్' నినాదంతో విదేశీయులను ప్రత్యేకించి భారతీయ నిపుణుల రాకను నిరోధించేందుకు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు భారత్, ఐటి ఇండస్ట్రీ బాడీ నాస్కమ్ చర్యలు ప్రారంభించాయి. అమెరికాలో నిపుణుల కొరత కారణంగా 'హెచ్ 1 బీ' వీసా నిబంధనలను ట్రంప్ ప్రభుత్వం కఠినతరం చేయలేదని నాస్కమ్ స్పష్టం చేసింది.
ఈ మేరకు అమెరికాలో ఐటి రంగంలో భారత నిపుణుల సేవలను గుర్తుచేస్తూ ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతికి ఎలా దోహద పడుతున్నదన్న విషయం వివరించేందుకు బరిలోకి దిగింది. తొలుత డొనాల్డ్ ట్రంప్ సర్కార్తో దౌత్య వర్గాల ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నది. తప్పని సరైతే విదేశాల నుంచి ఔట్ సోర్సింగ్ విధానం ద్వారా సేవలందించేందుకు అనుమతించాలని నాస్కమ్, భారత ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నాయి.
హెచ్ 1 బీ వీసా నిబంధనలను కఠినతరంచేస్తే అమెరికాలో స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ అండ్ మాథ్స్) విద్యార్థులతో కూడిన నైపుణ్యం కొరత ఏర్పడుతుందని నాస్కమ్ గ్లోబల్ ట్రేడ్ డెవలప్ మెంట్ ఉపాధ్యక్షుడు శివేంద్ర సింగ్ తెలిపారు. అమెరికాలో గల అంతరాయాన్ని మాత్రమే భారత ఐటి సంస్థలు, నిపుణులు భర్తీ చేయడంలో సహకరిస్తున్నారే తప్ప ఎవరి అవకాశాలు కొల్లగొట్టడం లేదని శివేంద్ర సింగ్ తేల్చి చెప్పారు.
ఐటీ రంగంలో పరిస్థితి ఇదీ..
‘అమెరికాలో నిపుణుల నాణ్యత లేమి సవాల్గా పరిణమించింది. స్టెమ్ స్కిల్స్ నిపుణుల కొరత గణనీయంగా ఉంటుంది. 2018 నాటికి అమెరికా కార్మిక శాఖ తెలిపిన వివరాల ప్రకారం అమెరికా కంపెనీలకు 24 లక్షల మంది నిపుణుల కొరత ఉంటుంది. వాటిలో సగానికి పైగా కంప్యూటర్, ఐటీ ఆధారిత రంగాల్లోనే ఉంటుంది' అని శివేంద్ర సింగ్ తెల్చి చెప్పారు. కారణాలైమనా అమెరికాలో ఔట్ సోర్సింగ్ సేవల్లో భారతీయులే 58 శాతం మంది ఉంటారు. అమెరికాలో ప్రత్యేక నైపుణ్యంగల విభాగాల్లో విదేశీయులకు తాత్కాలిక ఉద్యోగాలు కల్పించేందుకు ప్రతిపాదించిందే ‘హెచ్ 1 బీ' వీసా విధానం. స్వదేశీ నినాదమిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత జాతిపిత మహాత్మాగాంధీ అనుసరించిన అహింసా మార్గాన్నే కొనసాగిస్తారా? అని నాస్కమ్ ప్రతినిధులు ట్రంప్కు సవాల్ విసిరారు.
ఇలా ట్రంప్ విధానాలపై నాస్కామ్..
‘ట్రంప్కు ఆ సత్తా ఉంటే గాంధీ విధానాలను ఆచరించగల దమ్ము ఉంటే ఇంగ్లండ్ ఫ్యాక్టరీల్లో తయారైన గార్మెంట్స్ ను బహిష్కరించాలని అమెరికన్లకు పిలుపునివ్వాలి. ఫ్రీ క్రెడిట్ కార్డులు బహిష్కరించమని కోరాలి. 150 డాలర్లు చెల్లించే ఫ్రీ కార్డులను ధ్వంసం చేయాలని పిలుపునివ్వాలి' అని నాస్కామ్ వైస్ చైర్మన్, ఖ్వాట్రో గ్లోబల్ సర్వీసెస్ సీఎండీ రమణ్ రాయ్ డిమాండ్ చేశారు. రమణ్ రాయ్ భారత బీపీవో పరిశ్రమలో కీలకమైన వ్యక్తి. అమెరికాలో నిపుణుల కొరత ఉన్నదని, ప్రత్యేక నిపుణులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు పునాది అని రమణ్ రాయ్ గుర్తు చేశారు.
అమెరికా యూనివర్సిటీల్లో 85 % విద్యార్థులపై ఇలా..
భారత్తోపాటు ఫిలిప్పీన్స్, శ్రీలంక తదితర దేశాల పౌరులు ప్రతిభావంతులని, వారిలో 85% మంది అమెరికా యూనివర్సిటీల్లో పేరు నమోదు చేసుకున్న శరణార్థులని రమణ్ రాయ్ గుర్తు చేశారు. నాలుగేళ్లలో అమెరికాకు భారత ఐటీ సంస్థలు 20 బిలియన్ల డాలర్ల పన్ను చెల్లించాయని నాస్కమ్ పేర్కొంది. అదీ కేవలం 41 వేల మంది ఉద్యోగుల మద్దతుతో మాత్రమేనని గుర్తుచేసింది. ఒకవేళ క్షేత్రస్థాయి సవాళ్లకు భిన్నంగా డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల వాగ్దానం అమలుకు కట్టుబడి ఉంటే నిపుణులు, ప్రతిభావంతులకు సంబంధించిన అంశాలను ఆయన పరిష్కరించాల్సి ఉంటుందని బీపీవో నిపుణుడు దీపక్ కపూర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం భారత ఐటీ, బీపీవో రంగం ఆచితూచి అడుగులు ముందుకు వేస్తున్నదన్నారు. అనిశ్చితికి తెరతీస్తారా? లేదా? అని ఇప్పటికిప్పుడు వ్యాఖ్యానించడం తొందర పాటవుతుందని ఆయన పేర్కొన్నారు.
భారత ఐటీ సంస్థలతో అమెరికన్లకు ఉపాధి..
భారత ఐటీ సంస్థలు తమ పెట్టుబడులను అమెరికాలో పెట్టడం ద్వారా ఆ దేశ పౌరులకు ఉపాధి కల్పిస్తున్నాయని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య వ్యవహారాలశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 35 లక్షల మందికి పైగా భారతీయ నిపుణులపై హెచ్ 1 బీ వీసా నిబంధనల కఠినతరం చేయడానికి ట్రంప్ సర్కార్ సిద్ధమవుతుండటంతో దానికి ప్రతిగా భారత ప్రభుత్వం ప్రత్యామ్నాయ వ్యూహం అమలు చేయ పూనుకున్నది. అమెరికన్లకు 150 బిలియన్ డాలర్ల పెట్టుబడితో కూడిన భారత ఐటీ రంగ సర్వీసుల ప్రాధాన్యాన్ని డొనాల్డ్ ట్రంప్ గుర్తించాలని ఆమె ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అమెరికా ప్రజాప్రతినిధులతో సంప్రదింపులు చేపట్టిన నాస్కమ్ చర్యలకు కూడా కేంద్రం మద్దతు పలికింది. ప్రస్తుతం నాస్కమ్ ప్రతినిధులు అమెరికాలోని కాపిటోల్ హిల్స్లో ఆ దేశ ప్రజాప్రతినిధులతో సంప్రదింపుల కోసం, వైట్ హౌస్లో ట్రంప్ ప్రభుత్వ ప్రతినిధుల కోసం సంప్రదింపులకు వేచి చూస్తున్నారు.