అమెరికాలో హింస: మరో పోలీస్ మృతి -క్యాపిటల్ భవంతి ఘటనపై కొనసాగుతోన్న రాజీనామాలు
అగ్రరాజ్యంలో అధ్యక్ష ఎన్నికల సందర్భంగా తలెత్తిన రాజకీయ వివాదం కాస్తా ఆ దేశ పార్లమెంట్ భవనమైన క్యాపిటల్ బిల్డింగ్ పై దాడితో హింసాత్మక మలుపు తిరిగడం, ట్రంప్ అనుచరుల దాడి, అనంతరం చలరేగిన హింసలో మృతుల సంఖ్య పెరిగింది. బుధవారం నాటి ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న మరో పోలీస్ అధికారి శుక్రవారం కన్నుమూయడంతో చనిపోయినవారి సంఖ్య 5కు చేరింది.
ట్రంప్ అనుచరులు దాడి జరిపిన సమయంలో క్యాపిటల్ భవంతిలోనే విధులు నిర్వహిస్తోన్న బ్రియాన్ సిక్నిక్ అనే పోలీస్ అధికారి దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతోన్న బ్రియాన్.. శుక్రవారం తుదిశ్వాస విడిచినట్లు అధికారులు ప్రకటించారు. తాజా మరణంతో ఒక మహిళ సహా మొత్తం ఐదుగురు చనిపోయినట్లయింది.
క్యాపిటల్ భవంతి హింస నేపథ్యంలో పలు విభాగాల్లో ఉన్నతాధికారులు పలువురు తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. క్యాపిటల్ భవంతి పోలీస్ విభాగం చీఫ్ స్టీవెన్ సుండ్ కూడా పదవి నుంచి తప్పుకున్నారు. వైట్హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ సారా మాథ్యూస్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, స్టెఫానీ గ్రిషామ్, వైట్హౌస్ సామాజిక కార్యదర్శి అన్నా క్రిస్టినా,రవాణా కార్యదర్శి ఎలైన్ చావో తన పదవులకు రాజీనామా చేశారు.
అమెరికా పార్లమెంటుపై ట్రంప్ మద్దతుదారులు జరిపిన దాడి ఘటన నిజంగా అమెరికా చరిత్రలోనే చీకటి రోజని, అమెరికా ప్రజాస్వామ్యంపై ఇది ఊహించని దాడి అని నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ పేర్కొన్నారు. ట్రంప్ చేసిన ప్రజాస్వామ్య ధిక్కార ఫలితమే హింసాత్మక ఘటనలకు కారణమని స్పష్టంచేశారు. క్యాపిటల్ భవనం వద్ద జరిగిన అల్లర్లు వారి అసమ్మతి, ఆందోళన, నిరసనలు కావని.. అవి నిజంగా గందరగోళ పరిచే అల్లర్లేనని జో బైడెన్ పేర్కొన్నారు.
అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడం, అభిశంసన భయాలతో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈనెల 20న అధికార మార్పిడికి సిద్ధమంటూ ప్రకటన చేశారు. కానీ ఎన్నికల ఫలితాలను తాను ఎన్నటికీ విశ్వసించబోనని, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో పోరాటం కొనసాగిస్తానని ట్రంప్ స్పష్టం చేశారు.