చైనా గుట్టు రట్టు.. రీసెర్చర్ వేషంలో స్పై - కాన్సులేట్లో నక్కి ఎఫ్బీఐకి చిక్కి - ట్రంప్ సీరియస్..
అమెరికా, చైనా మధ్య దౌత్య సంబంధాలు విచ్ఛిన్నం దిశగా వెళుతున్నాయి. రెండు దేశాల మధ్య బంధానికి ప్రతీకగా నిలిచే హ్యూస్టన్ చైనీస్ రాయబార కార్యాలయాన్ని అమెరికా మూసేయడంతో.. చైనా తన గడ్డపైనున్న(చెంగ్డూ సిటీలోని) అమెరికన్ కాన్సులేట్ ను బంద్ పెట్టింది. చర్యకు ప్రతిచర్య కొనసాగుతుండగానే.. శాన్ ఫ్రాన్సిస్కోలోని చైనా ఎంబసీలో మరో బాంబు పేలింది. రీసెర్చర్ వేషంలో అమెరికాలోకి ప్రవేశించిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)కి చెందిన ఓ మహిళా అధికారిని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్బీఐ) అరెస్టు చేసింది. ఆ వెంటనే అన్ని చైనీస్ కాన్సులేట్లను మూసేస్తామంటూ ప్రెసిడెంట్ ట్రంప్ హెచ్చరించారు.
జగన్ సర్కారుకు భారీ షాక్.. నిమ్మగడ్డ కేసులో సుప్రీం తీవ్ర స్పందన.. 'ధిక్కరణ'పై స్టే కు నిరాకరణ..
నాటకీయ ఫక్కీలో..
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో జువాలజీలో రీసెర్చర్ గా చేరిన టాంగ్ జువాన్ అనే మహిళలను ఎఫ్బీఐ అరెస్టు చేసింది. జువాన్ రికార్డులు పరిశీలించగా, ఆమె చైనీస్ ఆర్మీలో వైద్యాధికారిగా పనిచినట్లు తేలడంతో కాలిఫోర్నియాలో ఆమెపై ఈనెల 20న కేసు నమోదైంది. అయితే, అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఆమె శాన్ ఫ్రాన్సిస్కోలోని చైనా రాయబార కార్యాలయంలో తలదాచుకుంది. ఎఫ్బీఐని లోనికి రానీయకుండా చైనా అధికారులు అడ్డుకోవడంతో కాన్సులేట్ వద్ద నాటకీయత చోటుచేసుకుంది. గంటల ప్రయత్నం తరువాత ఎట్టకేలకు ఎఫ్బీఐ ఆమెను అదుపులోకి తీసుకుంది. రీసెర్చ్ పేరుతో కొన్నేళ్లుగా అమెరికాకు వచ్చిపోతున్న జువాన్.. వీసాల్లో ఒక్కోసారి ఒక్కోలా వీసాల్లో తన వివరాలను పేర్కొన్నట్లు వెల్లడైంది.
స్పై ఆరోపణలపై వరుస అరెస్టులు..
శాన్ ఫ్రాన్సిస్కోలో టాంగ్ జువాన్ ను అరెస్టు చేయడానికి ముందు.. గూఢచర్యం ఆరోపణలపైనే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకురాలు సాంగ్ చెన్ను, లాస్ ఎంజెలిస్ లో ఉంటోన్న మరో రీసెర్చర్ వాంగ్ షిన్ ను కూడా ఎఫ్బీఐ అరెస్టు చేసింది. ఈ ముగ్గురూ పీఎల్ఏలో పనిచేసివాళ్లేనని, నిత్యం ఒకరికొకరు టచ్ లో ఉంటూ.. అమెరికా పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని, మేథోసంపత్తి చౌర్యానికి పాల్పడుతున్నట్లు ఎఫ్ బీఐ ఆరోపించింది. ఉత్తర కాలిఫోర్నియాలోని డ్యూక్ యూనివర్సిటీకి చెందిన మరో మహిళా రీసెర్చర్ కూడా గూఢచర్యం ఆరోపణలపై చైనాకు తిప్పిపంపారు.
గూఢచారులకు ఎంబసీ ఆశ్రయం..
అమెరికా పౌరులు, ఇతర వ్యవహారాలపై గూఢచర్యం నిర్వహిస్తోన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టాంగ్ జువాన్ కు చైనా కాన్సులేట్ ఆశ్రయం కల్పించడంపై అమెరికా భగ్గున మండింది. రాయబార కార్యాలయాలను ఈరకంగా వాడుకోవడమేంటని ఆగ్రహించింది. అరెస్టయిన ముగ్గురూ జువాలజీ రీసెర్చర్లే కావడాన్ని బట్టి.. అమెరికా బయోమెడికల్ రీసెర్చ్ను చైనా దొంగతనం చేసేందుకు ప్రయత్నిస్తోందని తేలిపోయినట్లు టెక్సాస్ కాంగ్రెస్మన్ మైఖేల్ మెక్కౌల్ వ్యాఖ్యానించారు. హ్యూస్టన్ లోని ‘టెక్సాస్ మెడికల్ సెంటర్'లో కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం పరిశోధనలు జరుగుతున్నాయని, అక్కడి సమాచారాన్ని దొంగిలించడానికి చైనా గూఢచారులు ప్రయత్నాలు చేశారని, ఆ క్రమంలోనే హ్యూస్టన లోని చైనా కాన్సులేట్ లో రహస్య ఫైళ్లను తగులబెట్టారని మైక్ కౌల్ ఆరోపించారు.
జగన్ తీరు పెద్ద జోక్..నిమ్మగడ్డను కూర్చోనిద్దాం..సహజీవనానికి బెడ్లు చాలవు..సాయిరెడ్డి వల్లే: రఘురామ
పాంపియో సంచలన ఆరోపణలు..
‘‘చైనా రోజుకో కొత్త కుట్రతో దౌర్జన్యాలకు తెరలేపుతోంది. సొంత దేశంలో నియతృత్వాన్ని అమలు చేసే డ్రాగన్.. ఇతర ప్రాంతాల్లోనూ స్వేచ్ఛను హరించాలనుకుంటోంది. చైనీస్ కమ్యూనిస్టు పార్టీ.. మొత్తం ప్రపంచాన్నే బానిసలా మార్చుకోవాలని చూస్తోంది. హ్యూస్టన్ లోని రాయబార కార్యాలయాన్ని గూఢచర్యానికి అడ్డాగా వాడుకుంటోంది. అందుకే దాన్ని మూసేయించాం''అంటూ అమెరికా విదేశాంగ సెక్రటరీ మైక్ పాంపియో సంచలన ఆరోపణలు చేశారు. నవంబర్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో చైనాకు వ్యతిరేకంగా ట్రంప్, ఆయన మంత్రులు తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండటాన్ని రాజకీయ ఎత్తుగడగానూ విమర్శించేవాళ్లు లేకపోలేదు.
Recommended Video
చైనా కాన్సులేట్లు అన్నీ మూసేస్తాం..
అమెరికాలోని చైనీస్ రాయబార కార్యాలయాలు కేంద్రంగా పెద్ద ఎత్తున స్పయింగ్ జరుగుతున్నట్లు ప్రెసిడెంట్ ట్రంప్ ఆరోపించారు. అమెరికా పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ, మేధోసంపత్తిని కాపాడుకునే దిశగా కఠిన నిర్ణయాలు తీసుకుంటామని ఆయన చెప్పారు. హ్యూస్టన్ లోని రాయబార కార్యాలయాన్ని మూసేసినట్లే.. అమెరికాలోని మిగతా కాన్సులేట్లను కూడా మూసేస్తామని ఆయన హెచ్చరించారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ లో సహా మొత్తం ఐదు చోట్ల చైనా రాయబార కార్యాలయాలు ఉన్నాయి. వాటిలో మొట్టమొదట(1979లో) స్థాపించిన హ్యూస్టన్ కాన్సులేట్ ఇప్పటికే మూతపడగా, శాన్ ఫ్రాన్సిస్కోలోని కాన్సులేట్ మూసివేతకు కూడా ఆదేశాలు వెలువడొచ్చని తెలుస్తోంది. మొత్తంగా అమెరికా, చైనా మధ్య దౌత్య సంబంధాలు విచ్ఛిన్నం దిశగా వెళుతున్నాయి.