షాకింగ్: చైనా పైకి అమెరికా యుద్ధవిమనాలు - షాంఘైకి అతి సమీపంగా చక్కర్లు - తీవ్ర ఉత్కంఠ
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక, సైనిక వ్యవస్థలైన అమెరికా, చైనా మధ్య వైరం యుద్ధానికి దారితీసిందా? అనేత స్థాయిలో పరిణామాలు మారిపోయాయి. ఇప్పటికే రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దాదాపు విచ్ఛిన్నమైపోగా, ఇప్పుడు డ్రాగన్ దేశంపైకి అమెరికా యుద్ధవిమానాల రాక తీవ్ర కలకలం రేపుతున్నది. చైనా ఆర్థిక రాజధాని షాంఘై సిటీకి అతి సమీపంగా యూఎస్ యుద్ధవిమానాలు చక్కర్లు కొట్టడం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది.
Recommended Video
ఏపీ బీజేపీలో భారీ మార్పు: కన్నా ఔట్ - కొత్త అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకం - కారణం ఇదేనా?
దక్షిణ చైనా సముద్రంపై పట్టు కోసం చైనా తీవ్రంగా తపిస్తున్నవేళ.. దాన్ని అడ్డుకునేందుకు అమెరికా సైతం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో అమెరికా నౌకా దళానికి చెందిన 'యూఎస్ఎస్ రఫాయిల్ పెరాల్టా' యుద్ధ నౌక తైవాన్ జలసంధిలో కొంత కాలంగా పాగా వేసింది. ఆ నౌక నుంచి బయలుదేరిన రెండు యుద్ధ విమానాలు షాంఘై సిటీకి అతి సమీపంగా ప్రయాణించాయి.
యాంటీ సబ్ మరైన్ యుద్ధ విమానంగా గుర్తింపు పొందిన పీ-8ఏ(పాసిడోన్).. షాంఘై సిటీకి 76.5 కిలోమీటర్ల సమీపంగా చక్కర్లు కొట్టిందని, చరిత్రలో అమెరికాకు చెందిన యుద్ధ విమానం ఓ చైనా సిటీకి ఇంత దగ్గరగా రావడం ఇదే తొలిసారి అని హాంకాంగ్ కేంద్రంగానడిచే 'సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్' మీడియా సంస్థ రిపోర్టు చేసింది.
ఈపీ-3ఈ అనే మరో అమెరికా యుద్ధ విమానం.. ఆగ్నేయ చైనాలోని ఫుజియాన్ తీరానికి 106 కిలోమీటర్ల దూరంలో ప్రయాణించినట్లు పోస్ట్ వెల్లడించింది. తైవాన్ జలసంధిలో తిష్టవేసిన యుద్ధ నౌక నుంచి గడిచిన 12 రోజులుగా విమానాలు అటూ ఇటూ చక్కర్లు కొడుతున్నాయని, అయితే, చైనీస్ గనన తలానికి అతి సమీపంగా వెళ్లడం మాత్రం ఇదే మొదటిసారని ఆ మీడియా సంస్థ పేర్కొంది. ఈ ఘటనపై రెండు దేశాలు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ చైనాతో వైరం యుద్ధం స్థాయికి చేరడం గమనార్హం. చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఎవరినీ అమెరికా గడ్డపైకి అడుగుపెట్టనీయబోమని ట్రంప్ హెచ్చరించిన క్రమంలో.. చైనాకు చెందిన ముగ్గురు రీసెర్చర్లను ఎఫ్ బీఐ అదుపులోకి తీసుకుంది. వాళ్లు రీసెర్చర్ల ముసుగులో వచ్చిన చైనీస్ ఆర్మీ సిబ్బంది అని ఎఫ్ బీఐ ఆరోపించింది.
గూఢచారులకు ఆశ్రయం కల్పిస్తూ, అమెరికా రహస్యాలను, పౌరుల సమాచారాన్ని దొంగిలిస్తున్నారనే ఆరోపణలతో హ్యూస్టన్ లోని చైనీస్ రాయబార కార్యాలయాన్ని అమెరికా ప్రభుత్వం మూసేసింది. శాన్ ఫ్రాన్సిస్కోలోని కాన్సులేట్ పైనా ఇదే రకమైన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. దీనికి ప్రతీకారంగా చైనా.. తన గడ్డపైనున్న చుగ్డూ సిటీలో అమెరికా కాన్సులేట్ ను మూసేయించింది. చైనా బలగాలు దగ్గరుండి మరీ కాన్సులేట్ లోని యూఎస్ జాతీయ జెండాను అవతనం చేశాయి.