పౌరసత్వ సవరణ బిల్లు: అమిత్షాపై ఆంక్షలు విధిస్తామన్న అంతర్జాతీయ మత స్వేచ్ఛా కమిషన్
వాషింగ్టన్ : పౌరసత్వ సవరణ బిల్లు సెగ అమెరికాను తాకింది. రాజ్యసభలో బిల్లు పాసై అమల్లోకి వచ్చిందంటే దేశం ప్రమాదంలోకి నెట్టివేయబడుతుందని అమెరికా అంతర్జాతీ మత స్వేచ్ఛా కమిషన్ హెచ్చరించింది. రాజ్యసభలో బిల్లు పాసై అమల్లోకి వస్తే అమిత్ షా పై ప్రభుత్వ నాయకత్వంపై ఆంక్షలు తప్పవని కమిషన్ హెచ్చరించింది. ఆమేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా అమెరికా ప్రభుత్వానికి సూచిస్తామని అంతర్జాతీయ మత స్వేచ్ఛా కమిషన్ పేర్కొంది.
ఈశాన్య రాష్ట్రాల్లో బంద్ : పౌరసత్వ బిల్లు ఆమోదానికి వ్యతిరేకంగా: 11 గంటల బంద్..!
మతప్రాతిపదికన పౌరసత్వం ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది అంతర్జాతీయ మత స్వేచ్ఛా కమిషన్ .పొరుగుదేశాల నుంచి వచ్చి భారత్లో స్థిరపడిన ముస్లింయేతర ప్రజలకు భారత పౌరసత్వం ఇస్తే దేశంలో మతపరంగా ప్రజలు విడిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. తప్పుడు మార్గంలో అత్యంత ప్రమాదకరమైన మలుపు పౌరసత్వ సవరణ బిల్లు అని అంతర్జాతీయ మత స్వేచ్ఛా కమిషన్ పేర్కొంది. భారత్కు ఘనకీర్తి తెచ్చిపెట్టే లౌకికత్వంను తుడిచిపెట్టే విధంగా బిల్లు రూపొందించబడిందని అంతర్జాతీయ మత స్వేచ్ఛా కమిషన్ వెల్లడించింది. భారత గడ్డపై నివసించే ప్రతి ఒక్కరూ సమానులే అని చెబుతుండగా తాజా బిల్లు మాత్రం ముస్లింయేతర ప్రజలకు మాత్రమే పౌరసత్వం కల్పించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పింది.
ఇక అస్సాంతో పాటు దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ ప్రక్రియ జరుగుతుండగా అక్కడ కూడా ముస్లింలను తమ దేశాలకు పంపింస్తున్నారనే విషయాన్ని అంతర్జాతీయ మత స్వేచ్ఛా కమిషన్ గుర్తుచేసింది. దీని వల్ల భారత ప్రభుత్వం ఒక మతపరీక్ష నిర్వహిస్తోందని మండిపడింది. మతం పేరుతో కొన్ని లక్షల మంది భారత పౌరసత్వాన్ని కోల్పోనున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాదు జార్ఖండ్ ఎన్నికల సందర్భంగా ప్రచారం చేసిన అమిత్ షా దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు చేసి తీరుతామని అక్రమంగా వచ్చిన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉంచమని చెప్పిన విషయాన్ని గుర్తుచేసింది.మొత్తానికి పౌరసత్వ సవరణ బిల్లు అమెరికాను కూడా తాకడంతో భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయో వేచిచూడాలి.