దేవయాని కేసుపై యుఎస్ మీడియా ఏమంటోంది?
వాషింగ్టన్: భారత దౌత్యవేత్త దేవయాని కోబ్రాగాడెకు సంబంధించిన వీసా కేసు వివాదం భారత్, అమెరికాల మధ్య దౌత్య సంబంధాలకు విఘాతం కలిగించేదిగా ఉండబోదని అక్కడి మీడియా పేర్కొంది. ఇరు దేశాలు వివాదాన్ని పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని తెలిపింది. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త వాతావరణం, దేవయాని కోబ్రాగాడె భారతదేశానికి తిరిగి వెళ్లడంతో కొంతమేర తగ్గిందని యూఎస్ డెయిలీ పేర్కొంది.
తన సహాయకురాలి వీసా విషయంలో అవకతవకలకు పాల్పడిన ఆరోపణలతో అక్కడి పోలీసు అధికారులు దేవయాని కోబ్రాగాడెను సంకెళ్లు వేసి అరెస్ట్ చేయడమేగాక దుస్తులు విప్పించి తనిఖీ చేసిన విషయం తెలిసిందే. దీంతో అమెరికా వైఖరి పట్ల భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ వ్యాప్తంగా అమెరికాకు వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగాయి.
భారత, అమెరికా దేశాల మధ్య చెలరేగిన ఈ వివాదం రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలపై తొందరలోనే ప్రభావం చూపే అవకాశం లేదని ‘భారత-అమెరికా సంబంధాలు' అనే శీర్షికన ప్రచురితం చేసిన కథనంలో పేర్కొంది. దౌత్య సంబంధాలకు విఘాతం కలగకుండా రెండు ప్రజాస్వామ్య దేశాలు సాధ్యమైనంత త్వరగా వివాదాన్ని పరిష్కరించుకునేందుకు చర్యలు చేపట్టాలని కోరింది. ఈ కథనంలో దేవయాని అరెస్ట్ తర్వాత భారత్ తీసుకున్న చర్యలను కూడా న్యూయార్క్ టైమ్స్ వివరించింది.
అమెరికా చట్టాలను విదేశాల దౌత్యవేత్తలు అవగాహన కలిగి ఉండాలని పేర్కొంది. అమెరికా కూడా దౌత్యవేత్తల డిమాండ్లను పరిశీలించాలని, భారత దౌత్యవేత్త విషయంలో అమెరికా ఏకపక్ష దోరణితో కాకుండా వివాద పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని కోరింది. భారత దౌత్యవేత్త కేసు విషయంలో రెండు దేశాల మధ్య భేదాభిప్రాయాలు చోటు చేసుకున్నాయని వివరించింది. ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి రెండు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడేందుకు, వివాద పరిష్కారానికి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆ కథనంలో పేర్కొంది.
కాగా ఇటీవల అమెరికా దౌత్యవేత్త వేన్ మే, అతని భార్య, దౌత్యవేత్త అయిన అలిసియా ముల్లర్ భారత్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలోని తోటమాలి కంటే తమ ఇంట్లోని కుక్క చాలా ఆరోగ్యంగా ఉంటుందని, ఎక్కువ ప్రోటీన్లు పొందుతోందని ఫేస్బుక్లో పేర్కొంది. భారత్ ఒక వికారమైన ప్రదేశమని, ఇక్కడ అత్యాచారాలు ఎక్కువగా జరుగుతాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా వీరి వ్యాఖ్యల పట్ల తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి.