అగ్రరాజ్యంలో కరోనా మరణ మృదంగం, 15 రోజుల్లో 30 వేల మంది మృత్యువాత..
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ మరణ మృదంగం కొనసాగుతోంది. వైరస్ సోకి చనిపోయిన వారి సంఖ్య 60 వేలకు చేరింది. 15 రోజుల క్రితం మృతుల సంఖ్య 30 వేల మార్క్కి చేరగా.. పక్షం రోజుల్లోనే మరో 30 వేల మంది చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇది ఇలానే కొనసాగితే 1967లో వియత్నాంతో జరిగిన యుద్దం కంటే ఎక్కువమంది చనిపోయే అవకాశం ఉంది.
వియత్నంతో జరిగిన యుద్దంలో 59 వేల పైచిలుకు మంది చనిపోగా.. 2017-2018లో ప్లూ వల్ల 61 వేల మంది అమెరికాలో చనిపోయారని అమెరికా సెంటర్ ఫర్ డిసిజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధికారులు చెబుతున్నారు. కానీ ఆ సంఖ్య కరోనా వైరస్ వల్ల పెరుగుతూనే ఉంది. వైరస్ సోకి జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు.
వైరస్ బారినపడి చనిపోయిన వారిలో ప్రపంచంలోనే.. అమెరికా అగ్రస్థానంలో ఉంది. ప్రతీ రోజు వైరస్ కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. శిక్షణ కలిగిన ఆరోగ్య కార్యకర్తలు, పరీక్షించే కిట్లు సరైన మోతాదులో లేవని అమెరికా అధికారులు తెలిపినట్టు 'రాయిటర్స్' తన కథనంలో పేర్కొన్నది.
Recommended Video
అమెరికాలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 10 లక్షల పైచిలుకు చేరింది. న్యూయార్క్లో వైరస్ బారినపడ్డ వారు 30 శాతం మంది ఉన్నారు. మరణాలు కూడా ఇక్కడే ఎక్కువగా సంభవించాయి. అమెరికాలో రోజుకు 2 వేల మందికి పాజిటివ్ కేసులు సోకుతున్నట్టు తెలుస్తోంది. వైరస్ కేసులు పెరగడం ఒక కారణమైతే.. మృతుల సంఖ్య కూడా పెరుగడం ఆందోళన కలిగిస్తోంది.