ఘోరం: డ్రైవర్ వదిలేశాడు, అమెరికాలో కారు మంటల్లో ఆర్తనాదాలు చేస్తూ భారత సంతతి యువతి మృతి
అమెరికాలో దారుణం జరిగింది. భారత సంతతికి చెందిన యువతి నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా తగలబడిపోయింది.
న్యూయార్క్: అమెరికాలో దారుణం జరిగింది. భారత సంతతికి చెందిన యువతి నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా తగలబడిపోయింది.
ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవడంతో చెలరేగిన మంటల్లో ఆమె దుర్మరణం చెందారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ దారుణం చోటు చేసుకుంది.
మహిళను కారులో ఎక్కించుకున్నాడు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సయీద్ అహ్మద్ (23) అనే వ్యక్తి హర్లీన్ గ్రెవాల్ (25) అనే భారతీయ సంతతికి చెందిన మహిళను కారులో ఎక్కించుకున్నాడు. ఆమె ప్యాసింజర్ సీట్లో కూర్చుంది.
కాంక్రీట్ పిల్లర్ను ఢీకొట్టాడు
అప్పటికే కొంచెం మద్యం సేవించిన అతడు బ్రూక్లీన్ - క్వీన్ ఎక్స్ప్రెస్ వేలో ఓ కాంక్రీట్ పిల్లర్ను బలంగా ఢీకొట్టాడు. దీంతో కారుకు మంటలు అంటుకున్నాయి. మంటలు చుట్టుముట్టాయి.
కారు దిగి, ప్యాసింజర్ను పట్టించుకోలేదు
ప్రమాదం జరగడంతో డ్రైవర్ సయీద్ అహ్మద్ వెంటనే కారు దిగాడు. అయితే వెనుకాలే ఉన్న ప్యాసింజర్ అయిన హార్లీన్ను పట్టించుకోలేదు. తాను మాత్రం మరో కారులో ఆసుపత్రికి వెళ్లాడు. కారు వద్దకు వచ్చిన ఫైర్ ఫైటర్స్ మంటలను ఆర్పారు. కానీ అందులో ఉన్న హర్లీన్ అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.
ఆర్తనాదాలు చేస్తూ నడిరోడ్డుపై కాలి చనిపోయింది
దీంతో ఆర్తనాదాలు చేస్తూ హర్లీన్ నడిరోడ్డుపై నిస్సహాయస్థితిలో కాలిపోయి చనిపోయింది. కారు డ్రైవర్ సయీద్ సోదరుడు ఈ విషయమై మాట్లాడాడు. తన సోదరుడు ఆమెను రక్షించేందుకు ప్రయత్నించాడని, కానీ కారు డోర్ ఇరుక్కుపోయి ఆమె బయటకు రాలేకపోయిందన్నాడు. అందుకే సయీద్ చేతులు కాలిపోయాయని చెప్పాడు. పోలీసులు సయీద్ పైన కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించారు. పోలీసులు అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.