ట్రంప్ గెలుపు కోసం: ప్రచార బరిలో భారతీయులు: ఇండియన్-అమెరికన్ మహిళ సారథ్యం
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల గడువు సమీపిస్తోన్న కొద్దీ అక్కడి ప్రచార పర్వం పతాక స్థాయికి చేరుకుంటోంది. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి రిపబ్లికన్లు, ఈ సారి విజయం సాధించలనే పట్టుదలతో డెమొక్రటిక్ పార్టీ నాయకులు ఎన్నికల ర్యాలీలను నిర్వహిస్తున్నారు. ప్రచార కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు. ఈ ఎన్నికల ప్రచార ర్యాలీల్లో ప్రవాస భారతీయుల హవా బలంగా వీస్తోంది. అమెరికాలో పెద్ద సంఖ్యలో స్థిరపడిన ప్రవాస భారతీయుల ఓటుబ్యాంకు డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో వారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రసన్నం చేసుకోవడానికి రెండు పార్టీలూ వ్యూహాలను రూపొందిస్తున్నాయి.
ట్రంప్ గెలుపు కోసం..
అమెరికాలో స్థిరపడిన భారతీయులు కూడా అధ్యక్ష ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి రెండుగా విడిపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. రిపబ్లికన్లు, డెమోక్రాట్లకు మద్దతుగా వేర్వేరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. డెమోక్రాట్లు ఓ అడుగు ముందుకేసి.. ప్రవాస భారతీయురాలు కమలా హ్యారిస్ను ఏకంగా ఉపాధ్యక్ష పదవి కోసం బరిలో దింపగా.. రిపబ్లికన్ల తరఫున కొందరు గవర్నర్ పదవుల కోసం పోటీ పడుతున్నారు. ఇదివరకు ఐక్యరాజ్య సమితిలో అమెరికా అంబాసిడర్గా పనిచేసిన భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ సారథ్యంలో ఇండియన్-అమెరికన్లు ట్రంప్ గెలుపు కోసం ప్రచార సభలను నిర్వహిస్తున్నారు.
ఇండియన్ వాయిసెస్ ఫర్ ట్రంప్ పేరుతో..
ఇండియన్ వాయిసెస్ ఫర్ ట్రంప్ పేరుతో ఇండియన్-అమెరియన్లు శనివారం ఫిలడెల్ఫియాలో భారీ ప్రచార సభను నిర్వహించారు. దీనికి నిక్కీ హేలీ నేతృత్వాన్ని వహించారు. ఇదివరకు ఆమె దక్షిణ కరోలినా నుంచి రెండుసార్లు గవర్నర్గా ఎంపికయ్యారు. కేబినెట్లో చోటు దక్కించుకున్న మొట్టమొదటి భారత సంతతికి మహిళ ఆమె. ఫిలడెల్ఫియాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీ, సెమినార్లో ఆమె పాల్గొన్నారు. పాకిస్తాన్కు వ్యతిరేకంగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి వివరించారు.
పాకిస్తాన్కు ఫండ్స్ నిలిపివేత..
ఉగ్రవాదాన్ని అణచివేయడానికి పాకిస్తాన్కు ఇదివరకటి ప్రభుత్వాలు పాకిస్తాన్కు పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేసేవని, డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వాటిని నిలిపివేసిందని నిక్కీ హేలీ తెలిపారు. అమెరికా సైనికులను తుదముట్టించడానికి ఆ నిధులు పాకిస్తాన్ వినియోగిస్తోందని ఆరోపించారు. 2018లోనే 300 మిలియన్ డాలర్ల నిధులను ట్రంప్ నిలిపివేశారని తెలిపారు. ప్రభుత్వం మారడమంటూ జరిగితే.. అమెరికా నుంచి మళ్లీ పాకిస్తాన్కు పెద్ద ఎత్తున నిధుల ప్రవాహం కొనసాగుతుందని ఆమె హెచ్చరించారు. 15 సంవత్సరాలుగా అమెరికా ప్రభుత్వాలు పాకిస్తాన్కు 33 బిలియన్ డాలర్ల నిధులను మంజూరు చేశాయని, అప్పటి పాలకుల మూర్ఖపు చర్యగా అభివర్ణించారు.
Recommended Video
భారత వ్యతిరేక దేశాలను ఏకాకిగా చేస్తోన్న ట్రంప్..
పాకిస్తాన్, చైనా వంటి భారత వ్యతిరేక దేశాలను డొనాల్డ్ ట్రంప్ ఏకాకిని చేస్తున్నారని తెలిపారు. ట్రంప్కు బదులుగా మరొకరు అధ్యక్షుడిగా ఎన్నికైతే.. ఆ రెండు దేశాలు మళ్లీ బలోపేతమౌతాయని, భారత పతనాన్ని కోరుకుంటాయని చెప్పారు. ఈ పరిస్థితి తలెత్తకుండా ఉండటానికి మరోసారి డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని నిక్కీ హేలీ స్పష్టం చేశారు. ట్రంప్ అనుసరించే విదేశాంగ విధానంగా అద్భుతంగా ఉందని, భారత్ వంటి దేశాల పురోగమనానికి అది మరింత ఊతమిస్తుందని పేర్కొన్నారు. భారత్ను కాదని, పాకిస్తాన్ చైనా వంటి దేశాలను ప్రోత్సహించడానికి ట్రంప్ ప్రభుత్వం నిరాకరిస్తున్నారని చెప్పారు.