కమలా హ్యారిస్ పదవీ లాక్కుంటారు..?: 2 నెలలే, రేపిస్టులకు అనుమతి.. ట్రంప్ ఆరోపణలు
డెమోక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. నిన్న రిపబ్లికన్ ఉపాధ్యక్ష అభ్యర్థి మైక్ పెన్స్, కమలా హ్యారిస్ మధ్య హాట్ హాట్ డిబేట్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ డిబేట్ వీక్షించిన ట్రంప్ తర్వాత మీడియాతో మాట్లాడారు. కమలా హ్యారిస్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.
నవంబర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ విజయం సాధిస్తే జో బైడెన్ కొద్దిరోజులే అధికారంలో ఉంటారని కామెంట్ చేశారు. రెండు నెలల తర్వాత అతని నుంచి కమలా హ్యారిస్ పదవి లాగేసుకుంటారని ఆరోపించారు. కమలా హ్యారిస్.. సోషలిస్ట్ కాదు అని.. కమ్యూనిస్ట్గా అభివర్ణించారు.
ట్రంప్ ప్రభుత్వ వైఫల్యాలను డిబేట్లో కమలా హ్యారిస్ ఎండగట్టారు. కరోనా వైరస్ నియంత్రణలో ట్రంప్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్ల అమెరికాలో రెండు లక్షలకుపైగా కరోనా మారణాలు జరిగాయని విమర్శించారు. ఒకవేళ ఎన్నికల్లో గెలిస్తే.. బిడెన్ నుంచి కమలా హ్యారిస్ పదవీ లాక్కొవడం ఖాయమని చెప్పారు. అంతేకాదు అమెరికా సరిహద్దులను తెరవాలనుకుంటున్నారని ఆరోపించారు. దేశంలోకి హంతకులు, రేపిస్టులను అనుమతించాలని చూస్తోందని ఆరోపణలు చేశారు.
ఇటు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ హోరా హోరీగా ప్రచారం చేస్తున్నారు. నాలుగేళ్లలో ట్రంప్ ప్రభుత్వం ఏమీ చేయలేదు అని.. కరోనా వైరస్ నియంత్రణ, వ్యాక్సిన్, ఆర్థిక మాంద్యం తదితర అంశాలపై జోబిడెన్ ఫోకస్ చేశారు. అయితే ప్రెసిడెంట్ పోల్స్లో బిడెన్ ముందువరసలో ఉన్నారు. బిడెన్ 52 శాతం ఓట్లతో ఉండగా.. ట్రంప్ 42 శాతం ఓట్లతో ఉన్నారు. అయితే ఇదీ ఎన్నికల సమయం వరకు మారొచ్చని.. గతంలో హిల్లరీ క్లింటన్కు జరిగిందీ ఇదేనని కూడా నిపుణులు సూచిస్తున్నారు.