చైనాపై నిప్పులు చెరిగిన ట్రంప్- కరోనాతో డ్రాగన్ కొట్టిన దెబ్బను ఎలా మర్చిపోగలమని ప్రశ్న
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరికొద్ది గంటలు మాత్రమే మిగిలున్న నేపథ్యంలో ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే చైనాను టార్గెట్ చేస్తూ ఇరువురు అభ్యర్ధులు ప్రచారం సాగిస్తుండగా.. రిపబ్లికన్ అభ్యర్ధి, ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ తన ప్రత్యర్ధి బిడెన్పై ఈ విషయంలోనూ ఆధిక్యం కోసం ప్రయత్నిస్తున్నారు.
తమ దేశంలో పుట్టిన కరోనా వైరస్ను నియంత్రించడంలో విఫలమైన చైనా.. అమెరికా ఆర్ధిక వ్యవస్ధకు కొట్టిన దెబ్బను తామెలా మర్చిపోగలమని రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ ఓటర్లను ప్రశ్నించారు. చివరి రోజు ప్రచారంలో భాగంగా చైనాను టార్గెట్ చేసేందుకు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నించారు. అమెరికా చరిత్రలోనే అత్యంత గొప్ప ఆర్ధిక వ్యవస్ధ ప్రస్తుతం పునరుజ్జీవన దశలో ఉందని, అయితే ఇది పతనం కావడానికి కారణమైన చైనాను మాత్రం తాము మర్చిపోలేమని ట్రంప్ వ్యాఖ్యానించారు.
కరోనా నేపథ్యంలో అమెరికా ఆర్ధిక వ్యవస్ధ తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంది. మిలియన్ల మంది ఉపాధి కోల్పోయారు. దీన్ని పదేపదే ప్రస్తావించడం ద్వారా ఓటర్లను ఆకట్టుకునేందుకు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తాము తీవ్ర ప్రయత్నాలు చేసి 2 లక్షల మంది ప్రాణాలు కాపాడామని, అయితే ఇదంతా చేసిన డ్రాగన్ దేశాన్ని మాత్రం మర్చిపోబోమన్నారు. గతేడాది డిసెంబర్లోనే చైనాలోని వుహాన్ ల్యాబ్లో కరోనా వైరస్ బయటపడినా ఆ దేశం మాత్రం దాన్ని బయటికి రానీయకుండా తొక్కిపెట్టిందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వల్ల అమెరికాలో 2 లక్షల 31 వేల మంది చనిపోయారని, 9 లక్షల మంది వైరస్ బారిన పడ్డారని ట్రంప్ తెలిపారు. ఇంత జరుగుతున్నా తన ప్రత్యర్ధి బిడెన్ మాత్రం చైనాపై మెతక వైఖరి అవలంబిస్తున్నారని, ఆయన గెలుపుని చైనా కోరుకుంటోందని ట్రంప్ ఆక్షేపించారు.