చట్ట ఉల్లంఘనే?: నాన్నకే ఓటేశానంటూ ట్రంప్ కొడుకు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అమెరికా చట్టాలను ఉల్లంఘించి ప్రవర్తించినట్లు తెలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ తనయుడు ఎరిక్ ట్రంప్ ఓటు వేసిన అనంతరం తన తండ్రికి ఓటు వేసినట్టు తెలిపాడు.
అంతేగాక, బ్యాలెట్ పేపర్ను సోషల్ మీడియాలో పోస్టు చేయడం సంచలనం సృష్టించింది. 'మా నాన్నకు ఓటు వేశాను. అమెరికా ఉజ్వల భవిష్యత్కు ఆయన కృషి చేస్తారు' అని ట్వీట్ చేశారు.
అయితే కొద్ది సేపటికే ఆ ట్వీట్ను తీసివేయడం గమనార్హం. న్యూయార్క్ రాష్ట్ర నిబంధనల ప్రకారం ఓటు వేసిన అనంతరం తాము ఎవరికి ఓటు వేశామో ప్రకటించడం చట్ట వ్యతిరేకం.
ఈ నిబంధనల ప్రకారం ట్రంప్ తనయుడిపై అధికారవర్గాలు ఏలాంటి చర్య చేపట్టనున్నారో అన్న అంశంపై ఉత్కంఠ ఏర్పడింది. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో బ్యాలెట్ పేపర్ను బహిరంగంగా ప్రదర్శించడంపై నిషేధం అమలులో ఉంది. అయితే న్యూయార్క్ రాష్ట్రంలో నిషేధంతో పాటు ఎవరికి ఓటువేశామో ప్రకటించడంపై కూడా నిషేధం ఉంది. ఈ నేపథ్యంలో ఎరిక్పై చర్యలు తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు.