అట్టుడుకుతోన్న అమెరికా: వైట్హౌస్ దగ్గర కత్తిపోట్లు -అన్ని సిటీల్లో నిరసనలు -ఆజ్యంపోసిన ట్రంప్
ఎన్నికల ఫలితాల్లో గందరగోళం నెలకొనడం.. కీలకమైన స్వింగ్ రాష్ట్రాల్లో కౌంటింగ్ ఆలస్యమవుతుండటం.. తుది ఫలితాలు రాకముందే తను గెలిచేశానని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం.. తదితర పరిణామాలు అగ్రరాజ్యం అమెరికాలో అశాంతిని రేకెత్తించాయి. దేశరాజధాని వాషింగ్టన్, ఆర్థిక రాజధాని న్యూయార్క్ సహా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో మంగళవారం రాత్రి నుంచే మొదలైన నిరసనలు.. బుధవారం ఉదయం దాకా కొనసాగుతూనే ఉన్నాయి. చిట్టచివరి ఓటును కూడా లెక్కించిన తర్వాతే ఫలితాలు ప్రకటించాలని నిరసనకారులు నినాదాలు చేస్తున్నారు. వేర్వేరు ఘటనల్లో డజన్ల మంది నిరసనకారుల్ని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..
షాకింగ్:శుక్రవారం దాకా ఫలితాలు రావు -పోస్టల్ బ్యాలెట్పై తకరారు -సుప్రీం ఆదేశాలను మార్చేసి
వైట్హజ్ సమీపంలో అలజడి..
వాషింగ్టన్ డీసీలో అమెరికా అధ్యక్ష భవంన వైట్ హౌజ్ కు కూతవేటు దూరంలోని బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ప్లాజా వద్ద మంగళవారం రాత్రి నుంచి నిరసనలు కొనసాగుతున్నాయి. ఫాసిజానికి వ్యతిరేకంగా నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చాలా సేపటి వరకు శాంతి యుతంగా సాగిన నిరసనలు.. ట్రంప్ ‘విక్టరీ' ప్రకటన తర్వాత రిపబ్లికన్ మద్దతు దారులు కూడా అక్కడికి దూసుకురావడంతో వాతావరణం హింసాత్మకంగా మారింది. నిరసనకారులు, ట్రంప్ మద్దతుదారులు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో ఒక మహిళ సహా ముగ్గురు కత్తిపోట్లకు గురయ్యారని పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో పలువురిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
దేశమంతటా అరెస్టుల పర్వం..
ఎన్నికల రోజు రాత్రి నిరసనలు చేపట్టేందుకు పలు గ్రూపులు ముందుగానే ప్లాన్ చేసుకున్నాయి. అయితే, శాంతియుతంగా సాగుతాయనుకున్న నిరసనలు కాస్తా ట్రంప్ ఏకపక్ష ప్రకనటతో హింసాత్మక మలుపు తీసుకున్నాయి. కాలిఫోర్నియా(లాస్ ఏంజిల్స్), నార్త్ కరోలినా, ఒరెగాన్, న్యూయార్క్, వాషింగ్టన్, ఇల్లినాయిస్, మిన్నెసోటా తదితర రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో తీవ్ర స్థాయి నిరసనలు చెలరేగాయి. కొన్ని చోట్ల ట్రంప్, బైడెన్ మద్దతుదారులు పరస్పరం దాడులకు దిగగా, మరికొన్ని చోట్ల నిరసనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పొగ బాంబులు, బేస్ బాల్ బ్యాట్లు, కత్తులు తదితర ఆయుధాల వాడకానికి సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి. వేర్వేరు ఘటనల్లో డజన్లకొద్దీ నిరసనకారుల్ని పోలీసులు అదుపుతోకి తీసుకున్నారు.
చిచ్చుపెట్టిన ట్రంప్ ప్రకటన..
ఎన్నికల ఫలితాలు రాకముందే ట్రంప్ విక్టరీ ప్రకటించుకునే అవకాశం ఉందని సోమవారం నుంచే వార్తలు గుప్పుమన్నాయి. కానీ వాటిని ఖండించిన ట్రంప్.. బుధవారం తెల్లవారుజామున అదే పని చేశారు. అప్పటిదాకా వెలువడిన ఫలితాల్లో ట్రంప్(213 ఎలక్టోరల్ ఓట్లు) కంటే బైడెన్ (238 ఓట్లు) ముందంజలో ఉన్నప్పటికీ.. పదికి పైగా రాష్ట్రాల్లో ఎర్లీ ఓటు(పోస్టల్ బ్యాలెట్) లెక్కించే విషయంలో ఆలస్యం నెలకొంది. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఆయా రాష్ట్రాలు తనకు వ్యతిరేకంగా అక్రమాలకు పాల్పడుతున్నాయని, వెంటనే కౌంటింగ్ ఆపేసి విజేతలను ప్రకటించాలని ట్రంప్ డిమాండ్ చేశారు. అంతేకాదు, ఎన్నికల్లో తానే గెలిచినట్లుగానూ ఆయన ప్రకటన చేశారు. దీంతో..
ఇలా చేస్తాడని ముందే ఊహించి..
ఫలితాల విషయంలో ట్రంప్ ఇలాంటిదేదో చేస్తాడని ముందే ఊహించిన ప్రజాసంఘాలు మంగళ, బుధవారాల్లో నిరసనలకు పిలుపునిచ్చాయి. ఫలితాలను కాపాడుకుంటామంటూ బ్లాక్ లైవ్స్ మ్యాటర్ సహా 165 గ్రూపులు దేశవ్యాప్తంగా 520కిపైగా కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. ఓట్ల లెక్కింపునకు ముందే ట్రంప్ తనను తాను విజేతగా ప్రకటించుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయా గ్రూపులు ఇదివరకే ప్రకటించగా, ట్రంప్ సరిగ్గా అదే పని చేయడంతో నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. ట్రంప్ వ్యతిరేక ప్రదర్శనలకు పిలుపునిచ్చిన వాళ్లలో లాయర్లు, మహిళలు, విద్యార్థులు కూడా ఉన్నారు.
ఫలితాలు ఆలస్యం.. కోర్టు జోక్యం తప్పదా?
అమెరికా ఎన్నికల ఫలితాలపై గందరగోళం కొనసాగుతుండటంతో నిరసనలు ఇంకా పెరగొచ్చని అధికారులు భావిస్తున్నారు. కీలకమైన ప్రాంతాల్లో పోలీసుల్ని మోహరించారు. ఇప్పటిదాకా వెలువడిన ఫలితాల్లో.. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లకుగానూ డెమోక్రటిక్ అభ్యర్థి జోబైడెన్ కు 238 ఓట్లు, రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ కు 213 ఓట్లు దక్కాయి. మరో 10 రాష్ట్రాల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. పెన్సిల్వేనియా సహా నాలుగు రాష్ట్రాల్లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై వివాదం చెలరేగింది. శుక్రవారం దాకా తుది ఫలితాలు రాబోవని అక్కడి అధికారులు ప్రకటించారు. ఫలితాలపై సుప్రంకోర్టును ఆశ్రయిస్తానని ట్రంప్ ప్రకటించగా, మేం కూడా లీగల్ టీమ్ తో సిద్ధంగా ఉన్నామని బైడెన్ తెలిపారు. ఈ దశలో కోర్టు జోక్యం చేసుకునే దాకా తుది ఫలితాలు వెలువడేలా కనిపించడంలేదు.
3 రాజధానులపై ప్రకృతి ప్రకోపం -మందడంలో శిబిరం కూలడమే నిదర్శనం: వైసీపీ ఎంపీ