రిగ్గింగ్ ఎన్నికలు! జో బైడెన్ గెలుపుపై తొలిసారి డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో డెమొక్రాటిక్ అభ్యర్తి జో బైడెన్ మేజిక్ ఫిగర్ దాటి అధికారాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. బైడెన్ కంటే చాలా తక్కువ ఓట్లు సాధించిన ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదట్నుంచి కూడా ఈ గెలుపును అంగీకరించడం లేదు. తాను ఓడిపోలేదంటూ చెప్పుకొస్తున్నాడు.
Recommended Video
రిగ్గింగ్ ఎన్నికలు.. జోది ఫేక్ గెలుపు
తాజాగా, జో బైడెన్ గెలుపుపై తొలిసారి డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా ప్రకటించారు. ఇటీవల జరిగిన ఎన్నికలను రిగ్గింగ్ ఎన్నికలుగా ట్రంప్ అభివర్ణించారు. ఎన్నికల్లో గెలుపొందిన బైడెన్పై తీవ్ర విమర్శలు చేశారు. మీడియా ఫేక్ కథనాల్లోనే బైడెన్ గెలిచినట్లు ఆయన పేర్కొన్నారు.
బైడెన్ గెలుపును అంగీకరించేది లేదంటూ ట్రంప్
బైడెన్ గెలుపును తాము అంగీకరించేది లేదని డొనాల్డ్ ట్రంప్ తాజాగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఎన్నికలకు సంబంధించిన ఫలితాలపై ప్రయాణం ఇంకా కొనసాగుతోందని స్పష్టం చేశారు. నవంబర్ 3న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి కావాల్సిన మెజార్టీ ఎలక్టోరల్ ఓట్లు సాధించి విషయం తెలిసిందే. అయితే, ట్రంప్ మాత్రం అధికారాన్ని బదలాయించేందుకు ససమిరా అంటున్నారు.
చట్టపరమైన చర్యలకు జో బైడెన్ అడుగులు..
ఇది ఇలావుండగా, ట్రంప్ వైఖరిపై జో బైడెన్ కూడా మండిపడుతున్నారు. అంతేగాక, అధికార బదిలీ విషయంలో కీలక పాత్ర పోషించే జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ కూడా అధికార బదిలీపై ఎలాంటి ప్రక్రియా ప్రారంభించకపోవడం పట్ల బైడెన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జీఎస్ఏపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడిన వెంటనే జీఎస్ఏ అధికార ప్రక్రయ మొదలుపెట్టాల్సి ఉంటుంది కానీ, ఇప్పటి వరకు ఆ పని ప్రారంభించకపోవడం గమనార్హం. ఈ క్రమంలోనే బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ ఓటమిని అంగీకరించకపోవడంతోనే జీఎస్ఏ ఎలాంటి చర్యలూ ప్రారంభించనట్లుగా తెలుస్తోంది.