షాకింగ్:శుక్రవారం దాకా ఫలితాలు రావు -పోస్టల్ బ్యాలెట్పై తకరారు -సుప్రీం ఆదేశాలను మార్చేసి
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. శుక్రవారం దాకా తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు కనిపించడంలేదు. దీనిపై రిపబ్లికన్, డెమోక్రాట్ పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం, కేసుల బెదరింపులు చోటుచేసుకుంటున్నాయి. ముందస్తు ఓట్ల(పోస్టల్ బ్యాలెట్) లెక్కింపుపై ఒక్కో రాష్ట్రం ఒక్కోలా వ్యవహరిస్తుండటమే గందరగోళానికి కారణంగా కనిపిస్తున్నది. మొత్తం 23.92 కోట్ల మంది ఓటర్లకుగానూ ఈసారి ఏకంగా దాదాపు 10 కోట్ల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. అయితే..
యూఎస్ ఎన్నికల ఫలితాల వేళ .. పారిస్ ఒప్పందం నుండి అధికారికంగా వైదొలగిన అమెరికా
పెన్సిల్వేనియా అధికారిక ప్రకటన..
కరోనా పరిస్థితుల కారణంగా ఈసారి ముందస్తుగా ఓట్లు వేసిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే పోస్టల్ ద్వారా ఆయా కేంద్రాలకు చేరిన బ్యాలెట్లను లెక్కించే విషయంలో తకరారు ఏర్పడింది. పెన్సిల్వేనియా రాష్ట్ర చట్టాల ప్రకారం పోస్టల్ బ్యాలెట్ ను కూడా పూర్తిగా లెక్కించిన తర్వాతే తుది ఫలితాలు వెల్లడవుతాయి. ఎర్లీ ఓటు(పోస్టల్ బ్యాలెట్)ను ఎలక్షన్(పోలింగ్) డే నాడే లెక్కించాలని సుప్రీంకోర్టు ఇదివరకే తీర్పు చెప్పి ఉండటంతో కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యమైంది. మొత్తం 20 ఎలక్టోరల్ ఓట్లున్న ఈ రాష్ట్రంలో దాదాపు సగం మంది ముందస్తు ఓటు విధానంలోనే ఓట్లేసి ఉండటంతో వాటిని లెక్కించడానికి శుక్రవారం దాకా సమయం పడుతుందని అధికారులు ప్రకటన చేశారు. నిజానికి..
46 ఎలక్టోరల్ ఓట్లపై తకరారు..
పెన్సిల్వేనియా ఒక్కటే కాదు.. అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుపై స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. కానీ రిపబ్లికన్లు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో నిబంధనలను సడలించి లేదా మార్చేసి.. మంగళవారం(ఎలక్షన్ డే) కంటే ముందే ఎర్లీ(పోస్టల్) ఓట్లను తెరిచి, కౌంటింగ్ చేపట్టారు. ప్రస్తుతం 20 ఎలక్టోరల్ ఓట్లున్న పెన్సిల్వేనియాతోపాటు మిచిగన్ రాష్ట్రం(16 ఎలక్టోరల్ ఓట్లు), విస్కాన్సిస్ రాష్ట్రం(10 ఎలక్టోరల్ ఓట్లు)లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ నిదానంగా సాగుతోంది. ఈ మూడు రాష్ట్రాల్లోని 46 ఎలక్టోరల్ ఓట్లు అధ్యక్ష అభ్యర్థి విజయం, పరాజయంపై ప్రభావం చూపుతాయి. మిచిగన్, విస్కాన్సిస్ లో బుధవారం మధ్యాహ్నం(స్థానిక కాలమానం ప్రకారం) నాటికి ఫలితాలు రావొచ్చని చెబుతున్నా, పెన్సిల్వేనియాలో మాత్రం శుక్రవారానికి తుది ఫలితాలు రానున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే తాము పోస్టల్ బ్యాలెట్లను ఆలస్యంగా(మంగళవారం పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి) లెక్కిస్తున్నామని ఆయా రాష్ట్రాల అధికారులు చెబుతున్నారు. కానీ..
ఆలస్యమైతే అవకతవకలు..
తాజా సమాచారం అందే సమయానికి పెన్సిల్వేనియాలో కేవలం 25 శాతం పోస్టల్ బ్యాలెట్(ఎర్లీ ఓటు)ను మాత్రమే లెక్కించారు. అదే పోలింగ్ బూత్ లలో పోలైన ఓట్ల లెక్కింపులో మాత్రం ట్రంప 55.7 శాతం ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఇక్కడ బైడెన్ కు 43.1 ఓట్లు దక్కాయి. కానీ ఫలితంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. మెజార్టీ డెమోక్రాట్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసినందున వాటిని లెక్కించిన తర్వాతే ఫలితాలు ప్రకటించాలని జోబైడెన్ డిమాండ్ చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పేరుతో ఫలితాల ప్రకటన ఆలస్యం అయ్యే కొద్దీ అవకతవకలు జరుగుతాయని వాదిస్తోన్న ట్రంప్.. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపును వెంటనే నిలిపేయాలని, పోలింగ్ బూత్ లో నమోదైన ఓట్ల ప్రకారం ఫలితాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై రిపబ్లికన్, డెమోక్రాట్లు ఇద్దరూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ప్రకటనలు చేశారు.
ఎర్లీ ఓటు కొంప ముంచిందా?
గతంలో ఎన్నడూ లేని విధంగా 2020 అధ్యక్ష ఎన్నికల్లో దాదాపు సగం మంది ఓటర్లు ఎర్లీ ఓటు వేయడం తెలిసిందే. పోస్టల్ బ్యాలెట్ ద్వారా కౌంటింగ్ కేంద్రాలకు చేరిన ఆ ఓట్లను లెక్కించే విషయంలో ఒక్కో రాష్ట్రం ఒక్కోలా వ్యవహరిస్తుండటం మొత్తం ఫలితాలపైనే ఎఫెక్ట్ పడింది. శుక్రవారానికి గానీ తుదిఫలితాలు వెల్లడికాబోవని పెన్సిల్వేనియా గవర్నర్ టామ్ వూల్ఫ్(డెమోక్రట్) అధికారికంగా ప్రకటించడంపై రిపబ్లికన్లు మండిపడుతున్నారు. ఎర్లీ ఓటు వేసినవారిలో అత్యధికంగా డెమోక్రటిక్ సపోర్టర్లు ఉండటం, ఇప్పుడా ఓట్లను లెక్కలోకి తీసుకోరాదంటూ రిపబ్లికన్లు గొడవ చేస్తుండటం ఏ పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాలి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లకుగానూ జోబైడెన్ 238, డొనాల్డ్ ట్రంప్ 213 ఓట్లను కైవసం చేసుకున్నారు. మరో 10 రాష్ట్రాలకు సంబంధించిన ఫలితాలు ఇంకా రాలేదు. పెన్సిల్వేనియా అధికారులు శుక్రవారం దాకా ఫలితాలు రావని చెబుతున్నారు. పోస్టల్ ఓట్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఏం చెబుతుందనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.