షాకింగ్ : ట్రంప్కు విషం పార్సిల్ - తాకితే 36 గంటల్లో ఖతం - ఎన్నికల వేళ కలకలం
ఇంకో నెలన్నర రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనుండా.. ప్రెసిడెంట్ అధికారిక నివాసం వైట్ హౌస్ కు ప్రమాదకర విషంతోకూడిన పార్సిల్ రావడం కలకలం రేపుతున్నది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అత్యంత ప్రమాదకరమైన 'రిసిన్' విషం పూసిన లేఖను డొనాల్డ్ ట్రంప్ పేరిట వైట్ హౌస్ కు పంపారు. దీనిని గుర్తించిన సెక్యూరిటీ అధికారులు.. సదరు పార్సిల్ ట్రంప్ కు చేరకుండా ఆపేశారు.
దానికి విరుగుడు లేదు..
వైట్ హౌజ్ కు విషం పూసిన లేఖతోకూడిన పార్సిల్ చేరడంపై అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్(ఎఫ్బీఐ) సహా ఇతర సంస్థలూ విచారణ చేపట్టాయి. పార్సిల్లో ఉన్నది రిసిన్ అనే అత్యంత విషపూరితమైన పదార్థంగా అధికారులు గుర్తించారు. ఇది అత్యంత ప్రమాదకరమైన పదార్థమని, దీన్ని తీసుకున్న 36 నుంచి 72 గంటల్లోగా మరణం తప్పదని, ఈ విషానికి ఇంతవరకూ యాంటీ డోస్ లేదని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు వెల్లడించారు. అమెరికాలో గతంలోనూ రిసిన్ పూసిన లేఖల ద్వారా పలు మరణాలు సంభవించినట్లు రికార్డులున్నాయి.
వచ్చింది కెనడా నుంచా?
ట్రంప్ కు విషం పార్సిల్ వచ్చిన ఘటనపై ఎఫ్బీఐతోపాటు సీక్రెట్ సర్వీస్, యూఎస్ పోస్టల్ ఇనస్పెక్షన్ సర్వీస్ సంయుక్తంగా విచారణ చేపట్టాయి. సదరు పార్సిల్ కెనడా నుంచి వచ్చినట్టుగా ప్రాధమికంగా గుర్తించినట్లు అధికారులు చెప్పారు. ఈ లేఖ వైట్ హౌస్ లోని ట్రంప్ ఆఫీసుకు చేరకముందే, స్థానిక ప్రభుత్వ మెయిల్ సెంటర్ లోనే అధికారులు గుర్తించారని అమెరికన్ మీడియా పేర్కొంది. ఈ విషం పార్సిల్ వల్ల ఇప్పటిదాకా ఎవరికీ అపాయం జరగలేదని తెలుస్తోంది. అయితే, వైట్ హౌస్, యూఎస్ సీక్రెట్ సర్వీస్ లు దీనిపై స్పందించేందుకు నిరాకరించాయి.
Recommended Video
జీవాయుధంగా రిసిన్..
వైట్ హౌజ్ కు పార్సిల్ కలకలం తర్వాత రెసిన్ కు సంబంధించి పలు విషయాలు చర్చలోకి వచ్చాయి. రెసిస్ విషాన్ని జీవాయుధంగానూ వాడుతారని తెలుస్తోంది. దీన్ని తాకితే.. 36 నుంచి 72 గంటల్లో మరణం సంభవిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. గతంలో ప్రెసిడెంట్ బరాక్ ఒబామాకు వేర్వేరు సందర్భాల్లో ఇలాంటి విషంతో కూడిన రెండు లేఖలు రాగా.. వాటిని పంపిన ఇద్దరు వ్యక్తుల్ని అధికారులు అరెస్టు చేశారు. ఒబామాతో బాటు న్యూయార్క్ మేయర్, ఓ హాలీవుడ్ నటుడిపైనా విషప్రయోగానికి ప్రయత్నం జరిగింది.