చైనాకు దెబ్బ మీద దెబ్బ... అమెరికా గట్టి షాక్... ఆ రెండు కంపెనీలపై నిషేధం...
చైనాకు చెందిన 59 యాప్స్పై నిషేధం విధిస్తూ భారత్ డిజిటల్ స్ట్రైక్ ప్రకటించిన మరుసటి రోజే అమెరికా కూడా డ్రాగన్ కంట్రీకి షాకిచ్చింది. చైనాకు చెందిన హువావే టెక్నాలజీస్,జెడ్టీఈ కార్పోరేషన్లను ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్(FCC) యూనివర్సల్ సర్వీస్ ఫండ్ నుంచి నిషేధించింది. చైనా మిలటరీ,ఇంటలిజెన్స్ విభాగాలతో ఈ రెండు కంపెనీలకు సంబంధాలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు,ఈ రెండింటితో అమెరికా జాతీయ భద్రతకు ముప్పు ఉందని పేర్కొంది.
ఆ ఒప్పందం రద్దు..
అమెరికాలో కమ్యూనికేషన్స్ టెక్నాలజీ ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ ఆధీనంలో ఉంటుంది. ఈ సంస్థకు చెందిన యూనివర్సల్ సర్వీస్ ఫండ్ పరిధిలోని పలు ప్రాజెక్టులకు హువావే,జెడ్టీఈ సప్లయర్స్గా ఉన్నాయి. ఈ కంపెనీలతో దాదాపు 8.3 బిలియన్ డాలర్ల(రూ.62,676కోట్లు) ఒప్పందం ఉంది. తాజాగా ఎఫ్సీసీ వీటిపై నిషేధం విధించడంతో ఆ ఒప్పందం రద్దు కానుంది. భద్రతా ముప్పు నుంచి అమెరికా నెట్వర్క్లను కాపాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎఫ్సీసీ వెల్లడించింది.
అదే కారణమన్న ఎఫ్సీసీ ఛైర్మన్...
హువావే,జెడ్ఈటీ కంపెనీలు రెండింటికీ చైనా కమ్యూనిస్ట్ పార్టీతో పాటు చైనా మిలటరీతో సంబంధాలున్నాయని ఎఫ్సీసీ చైర్మన్ అజిత్ పాయ్ తెలిపారు. ఆ దేశ ఇంటలిజెన్స్ సర్వీసులకు సహకరించడానికి ఇవి చైనీస్ చట్టాలకు లోబడి పనిచేస్తాయన్నారు. భవిష్యత్తులో అమెరికా 5జీ ప్రాజెక్టుకు కూడా వీటి నుంచి ముప్పు ఉండే అవకాశం ఉందన్నారు. కాబట్టి అమెరికా కమ్యూనికేషన్స్ నెట్వర్క్ చైనా కమ్యూనిస్ట్ పార్టీ బారిన పడకుండా చూసుకుంటామని... క్రిటికల్ కమ్యూనికేషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఆ నిధులు వేరే కంపెనీలకు...
ఎఫ్సీసీ కమిషనర్ జెఫ్రీ స్టార్క్స్ మాట్లాడుతూ... అమెరికన్ నెట్వర్క్స్లో ఈ రెండు కంపెనీలకు చెందిన నమ్మదగని పరికరాలు ఉన్నాయన్నారు. వీటితో భద్రతా ముప్పు ఉంటుందన్నారు. కాబట్టి అమెరికన్ కాంగ్రెస్ ఈ రెండు కంపెనీలకు కేటాయించిన నిధులను వేరే వాటికి ఇవ్వాలని సూచించారు. అమెరికా ఎఫ్సీసీ నిర్ణయంపై హువావే,జెడ్టీఈ కంపెనీలు మాత్రం ఇంతవరకూ స్పందించలేదు.
Recommended Video
భారత్ నిషేధం విధించిన మరుసటి రోజే...
చైనీస్ యాప్స్ వల్ల జాతీయ భద్రతకు ముప్పు ఉందని... యూజర్స్ సమాచారం చోరీ అవుతుందన్న కారణంతో భారత్ 59 చైనా యాప్స్పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇందులో టిక్ టాక్,హలో వంటి మిలియన్ల కొద్ది యూజర్స్ ఉన్న యాప్స్ కూడా ఉన్నాయి. జూన్ 15 రాత్రి భారత్,చైనా సరిహద్దులోని వాస్తవాధీన రేఖ వెంబడి గాల్వన్ వ్యాలీలో ఇరు దేశాల మధ్య తలెత్తిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి చైనా దూకుడుకు ఎలా అడ్డుకట్ట వేయాలా అని సమాలోచనలు జరుపుతున్న భారత్... చివరకు డ్రాగన్కు గట్టి షాకిస్తూ డిజిటల్ స్ట్రైక్ ప్రకటించింది.