హల్దీరాంకు అమెరికా షాక్, మ్యాగీపై నెస్లే కొత్త వాదన
న్యూఢిల్లీ/వాషింగ్టన్: మ్యాగీ నూడుల్స్ వివాదం పూర్తిగా సమసిపోకముందే నాగపూర్ కేంద్రంగా పని చేస్తున్న హల్దీరాం ఉత్పత్తులు అమెరికాలో అమ్మకాలకు యోగ్యంగా లేవని అక్కడి ఆహార భద్రత తనిఖీదారులు ముద్ర వేసినట్లు వాల్స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.
అధిక స్థాయిలో పురుగు మందులు, బ్యాక్టీరియా, బూజు వంటివి వాటిలో ఉన్నట్లు గుర్తించామని అమెరికా ఆహారశాఖ వెబ్సైట్లో పేర్కొంది. ఈ ఏడాది భారత్ నుంచి దిగుమతి చేసుకున్నవాటిలో తిరస్కరణకు గురైన ఎక్కువ ఉత్పత్తులు హల్దీరాం సంస్థవేనని పేర్కొంది.
వీటిలో కల్తీ పదార్థాలు, విషపూరితాలు ఉన్నాయని పేర్కొంది. బ్రిటానియా సంస్థకు చెందిన కొన్ని ఉత్పత్తుల్నీ అమెరికా తిరస్కరించింది. మరోవైపు, తమ ఆహార ఉత్పత్తులు పూర్తి సురక్షితమంటూ హల్దీరాం సంస్థ స్పష్టం చేసింది. భారత్లో అనుమతించే పురుగు మందును అమెరికాలో అనుమతించకపోవచ్చని తెలిపింది.
నెస్లే కొత్త వాదన
మ్యాగీ వివాదంలో నెస్లే సరికొత్త వాదనకు తెరలేపింది. జనవరిలో అమెరికా ఫుడ్ రెగ్యులేటర్ దిగుమతికి అనుమతించని మ్యాగీ ఉత్పత్తులు భారత్ నుంచి ఎగుమతి అయినవి కాదని, అవి నకిలీ ప్యాకెట్లను నెస్లే ప్రతినిధి వివరించారు.
అమెరికా ఎఫ్డీఏ వెబ్ సైట్ నుంచి తాము సమాచారాన్ని సేకరించామని, అవి భారత్లో తమచేత తయారైన ఉత్పత్తులు కాదని, కానీ వాటి పైన తమ సంస్థకు చెందిన లేబుల్స్ ఉన్నాయని పేర్కొంది. దీనిని బట్టి అవి నకిలీలని తెలుస్తోందని చెప్పింది.