అమెరికా నిర్ణయం: భారత ఐటీ కంపెనీలపై దెబ్బ
వాషింగ్టన్: భారతీయ ఐటీ కంపెనీలకు ఇబ్బంది కలిగించే వార్త. అమెరికా తీసుకున్న ఓ నిర్ణయం మన ఐటీ కంపెనీలపై పెను భారాన్ని మోపనుంది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంపై ఐటీ కంపెనీల ప్రతినిధులు ఇది వివక్షపూరితమైన నిర్ణయమని ఆరోపిస్తున్నారు.
భారత్కు ఎంతో మేలు చేస్తున్నామని గొప్పగా చెబుతోన్న ఒబామా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మధ్య ఉన్న సత్సంబంధాలపై కూడా ఈ నిర్ణయం ప్రభావం చూపుతోందని అంటున్నారు.
అసలు ఇంతకీ ఆ నిర్ణయం ఏంటని అనుకుంటున్నారా? ఒక్కో హెచ్-1బీ వీసాకు ఇండియన్ ఐటీ కంపెనీలు అదనంగా కనీసం 4 వేల డాలర్లు, ఒక్కో ఎల్-1 వీసాకు 4,500 డాలర్లు చెల్లించాల్సి రావడమే. గత డిసెంబర్ నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధనలు 2025 సెప్టెంబరు 30 వరకు అమల్లో ఉంటాయి.
ఈ మేరకు అమెరికా ఫెడరల్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ శుక్రవారం తన వెబ్సైట్లో ఉంచింది. హెచ్-1బీ వీసా వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే భారత్లోని ఐటీ ఉద్యోగులను అమెరికాలోని పలు కంపెనీ యజమానులు రప్పించుకునేందుకు ఉపయోగపడుతుంది.
ఇదిలా ఉంటే అమెరికాతో పాటు ఇతర దేశాల్లో కార్యాలయాలు కలిగిన అంతర్జాతీయ కంపెనీల ఉద్యోగులకు ఎల్-1 వీసాలు లభిస్తాయి. ఈ కొత్త నిబంధన వల్ల భారతీయ ఐటీ కంపెనీలపై ప్రతి ఏటా 400 మిలియన్ డాలర్ల అదనపు భారం పడుతోంది. దీంతో ప్రధాని మోడీ ఈ విషయమై అమెరికాతో మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు.
హెచ్-1బీ పిటిషనర్లు తమ కంపెనీలో 50 లేదా అంతకన్నా ఎక్కువ మంది సిబ్బంది అమెరికాలో ఉన్నపుడు, ఆ సిబ్బందిలో సగం కన్నా ఎక్కువ మంది హెచ్-1బీ, ఎల్-1ఏ లేదా ఎల్-1బీ నాన్ ఇమ్మిగ్రెంట్ స్టేటస్లో ఉంటే తప్పనిసరిగా అదనంగా 4 వేల డాలర్లు చెల్లించాలనేది కొత్త నిబంధన.