మెక్సికో గోడ వివాదం: సభ్యుల మధ్య కుదరని ఏకాభిప్రాయం... పాక్షికంగా స్థంభించిపోయిన ట్రంప్ సర్కార్
అమెరికాలో ప్రభుత్వం పనిచేయడం పాక్షికంగా నిలిచిపోయింది. అమెరికా మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణంకు అయ్యే నిధుల విడుదలకు సంబంధించిన తీర్మానానికి కాంగ్రెస్ ఆమోదం లభించలేదు. సభ్యులను ఒప్పించేందుకు అధ్యక్షుడు ట్రంప్ ఎంత ప్రయత్నించినప్పటికీ అది సాధ్యపడలేదు. ఈ అంశాన్ని సభలోని డెమొక్రాట్లు వ్యతిరేకిస్తున్నారు. దీంతో స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం అర్థరాత్రి 12.01 గంటల నుంచి ట్రంప్ సర్కార్ పనిచేయడం పాక్షికంగా నిలిచిపోయింది.
ప్రభత్వం స్తంభించిపోవడానికి కారణం డెమొక్రాట్లే అని ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం కనుగొంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం పనిచేయడం నిలిచిపోయింది కాబట్టి అమెరికా ఆర్థిక ఖజానా కూడా మూసుకుపోయింది. దీంతో ప్రభుత్వంలోని 15 శాఖలకు గాను 9 శాఖలకు ఖజానా నుంచి ఎలాంటి నగదు రాదు. ఇలా నిధులు చిక్కుకుపోవడంతో ప్రభుత్వం చేయాల్సిన పలు పనులు నిలిచిపోనున్నాయి. దీంతో ఈ శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా జీతాలు లేనట్టే. అంటే క్రిస్మస్ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతం అందకపోతే ఇబ్బందులు ఉంటాయని కొందరు ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అమెరికా ప్రభుత్వం స్తంభించిపోవడంతో ఈ ఏడాదిలో ఇది మూడో సారి కావడం విశేషం.
ఇక నిధులు నిలిచిపోవడంతో హోమ్లాండ్ సెక్యూరిటీ శాఖ, రవాణా, ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖ, అంతర్గత విభాగం, ట్రెజరీ, గృహనిర్మాణం మరియు పట్టణాభివృద్ధి శాఖలపై తీవ్ర ప్రభావం పడనుంది. అమెరికా మెక్సికో సరిహద్దులో గోడ కట్టాలని ట్రంప్ నిర్ణయించారు. ఈ గోడ నిర్మాణం జరిగితే మెక్సికో నుంచి అమెరికాలోకి ప్రవేశించే డ్రగ్స్, అక్రమవలసదారులకు చెక్ పెట్టొచ్చని భావించారు. అయితే అమెరికా మెక్సికో సరిహద్దుల మధ్య గోడ నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది డెమొక్రటిక్ పార్టీ.