అమెరికా..ఇదేం స్పీడు?: రోజూ వందల్లోనే: విషాదకర రికార్డు: పిట్టల్లా రాలుతున్న జనం..
న్యూయార్క్: భయానక కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుని అమెరికా విలవిల్లాడిపోతోంది. దిక్కుతోచని స్థితికి చేరుకుంది. అక్కడి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. రోజూ వందలాది మంది మరణిస్తున్నారు. నగరాలకు నగరాలు శ్మశానాలుగా మారాల్సిన దుస్థితిని ఎదుర్కొంటోంది. అగ్రరాజ్యం. రెండు లక్షల మంది మృతి చెందుతారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేసిన అంచనాలన్నీ నిజం అయ్యేలా కనిపిస్తోంది.. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తోంటే.
Recommended Video
ఇటలీని దాటేసి..
కరోనా వైరస్ మరణాల్లో అమెరికా విషాదకర రికార్డులను నెలకొల్పుతోంది. ఎవరూ కోరుకోని రికార్డులను స్థాపిస్తోంది. కరోనా మరణాల్లో ఇప్పటిదాకా అగ్రస్థానంలో కొనసాగుతోన్న ఇటలీని వెనక్కి నెట్టింది. టాప్ ప్లేస్లో నిలిచింది. అదే సమయంలో 20 వేల మార్క్ను కూడా అధిగమించింది. కరోనా దెబ్బకు అమెరికాలో జనం పిట్టల్లా రాలుతున్నారు. 24 గంటల వ్యవధిలో అమెరికాలో 1948 మంది మరణించారు. 5, 32, 879 మంది అమెరికన్లు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ మేరకు జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ వాటి వివరాలను వెల్లడించింది.
పాజిటివ్ కేసుల్లో రెండు లక్షలకు చేరువగా న్యూయార్క్
అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్లో కరోనా వైరస్ యథేచ్ఛగా చెలరేగుతోంది. న్యూయార్క్లోనే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువ అయింది. ఇప్పటిదాకా ఆ నగరంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1,81,144. ఈ ఒక్క నగరంలోనే 8,627 మంది వైరస్ బారిన పడి ప్రాణాలను కోల్పోయారు. జంటనగరం న్యూజెర్సీలో 2183, మిచిగాన్లో 1392 మంది ఇప్పటిదాకా మరణించారు. మిగిలిన నగరాలదీ అదే పరిస్థితి.
ఇటలీలో 19 వేల మందికి పైగా
మొన్నటిదాకా కరోనా వైరస్ మరణాల్లో అగ్రస్థానంలో కొనసాగిన ఇటలీలో పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు రావట్లేదు.స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్.. ఇలా అభివృద్ధి చెందిన దేశాలన్నీ కరోనా ధాటికి కకావికలం అవుతున్నాయి. కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నాయి. ఇటలీ-19,468, స్పెయిన్-16,606, ఫ్రాన్స్-13,832 మంది మరణించారు. అమెరికాతో పోల్చుకుంటే మిగిలిన దేశాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. అమెరికాలో 24 గంటల వ్యవధిలో 30 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
చైనా పరిస్థితేంటీ?
కరోనా వైరస్ను జన్మనిచ్చిన చైనాలో పరిస్థితులు దాాదాపుగా కుదుటపడ్డాయి. జనజీవనం యధాతథంగా కొనసాగుతోంది. కరోనా వైరస్ ఎపిక్ సెంటర్గా గుర్తింపు పొందిన వుహాన్లో ఇదివరకే లాక్డౌన్ను ఎత్తేశారు. హ్యుబే ప్రావిన్స్ సహా చైనాలోని అన్ని నగరాల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజలు స్వేచ్ఛగా బయట తిరుగాడుతున్నారు. తమ పనులను తాము చేసుకుంటున్నారు. అదే సమయంలో అమెరికా సహా దేశంలోని అన్ని దేశాలన్నీ కరోనా వల్ల మృత్యు కోరల్లో చిక్కుకున్నాయి.