షాకింగ్: ఇంకొద్ది గంటల్లో ట్రంప్ అభిశంసన - బిల్లుకు రిపబ్లికన్ల మద్దతు -అందరూ ఛీకొట్టినా జోబైడెన్ ఔదార్యం
అమెరికా ప్రజాస్వామ్యానికి గుండెకాయ లాంటి క్యాపిటల్ భవనంపై ట్రంప్ అనుచరులు దాడి చేసిన తర్వాత దేశంలో రాజకీయాలు తలకిందులైపోయాయి. ఎన్నికల ఫలితాలు అక్రమమంటూ ట్రంప్ చేస్తోన్న వాదనను సమర్థించిన రిపబ్లికన్ పార్టీ కూడా ఇప్పుడాయను ఛీకొడుతోంది. గద్దె దిగేందుకు ట్రంప్ అంగీకరించినా.. జోబైడెన్ పదవీ బాధ్యతలు చేపట్టబోయే జనవరి 20లోపు దేశంలో ఏదైనా జరగొచ్చనే భయాలు అందరినీ వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ను మెడపట్టి బయటికి గెంటేయడం ఒకటే సముచితమని డెమోక్రాట్లు భావిస్తుండగా, ఆ ఆలోచనకు రిపబ్లికన్లు సైతం వత్తాసు పలుకుతున్నారు...
అమెరికాలో కల్లోలం: ట్రంప్ సంచలనం -ఇది ఆరంభం మాత్రమే -అధికార బదిలీకి అంగీకరిస్తూనే శపథం
ఈనెల 20న మరో కల్లోలం?
అమెరికా కొత్త అధ్యక్షుడిగా జోబైడెన్ ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్న సమయం(జనవరి 20) దగ్గరపడుతోన్న కొద్దీ దేశంలో టెన్షన్ నెలకొంది. సామాజిక, రాజకీయ అశాంతి మరింత పెరుగుతోంది. క్యాపిటల్ భవనంపై దాడితో తాము ఎంతకైనా తెగిస్తామని ప్రకటించుకున్న ట్రంప్ అనుకూల శ్వేత జాత్యహంకార గ్రూపులు.. మరిన్ని దాడులకు కుట్ర పన్నుతున్నట్లు ఇంటెలిజెన్స్ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. బుధవారం నాటి క్యాపిటల్ ముట్టడిలో నిఘా సంస్థల వైఫల్యం బయటపడటంతో ఇపుడు భద్రతాయంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. ఆ క్రమంలోనే ఈనెల 20న జోబైడెన్ ప్రమాణస్వీకారానికి ఎలాంటి అడ్డకులు లేకుండా చేసేందుకు యంత్రాంగం తీవ్ర చర్యలకు ఉపక్రమించింది..
ట్రంప్ అనుకూల గ్రూపులపై ఉక్కుపాదం
ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ఫలితాలను ఎన్నటికీ అంగీకరించబోనంటూ ట్రంప్ చేసిన ప్రకటనకు అనుకూలంగా ఆయన మద్దతు దారులు మూడు నెలలుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తాజాగా క్యాపిటల్ భవంతిపై దాడి తర్వాత కూడా విద్వేష ప్రకటలు ఆగడంలేదు. దీంతో ట్రంప్ అనుకూల ఆన్లైన్ గ్రూపుల పోస్టింగ్లపైనా భద్రతా బలగాలు నిఘా పెట్టాయి. మితవాద తీవ్రవాద గ్రూపులు- బైడెన్ పట్టాభిషేకాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం కావడంతో దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ ఈ గ్రూపుల కదలికలపై నిఘా పెంచారు. ట్రంప్-అనుకూల అరాచక శక్తులు మళ్లీ పెట్రేగి బైడెన్ ప్రమాణస్వీకారోత్సవాన్ని భగ్నం చేయకుండా వాషింగ్టన్ అంతటా నిషేధాజ్ఞలు విధిస్తున్నారు. అంతేకాదు..
ట్రంప్పై అభిశంసన.. సోమవారమే బిల్లు
క్యాపిటల్ భవంతిపై దాడికి మూల కారకుడు ట్రంపే అని, గడిచిన మూడు నెలలుగా ఆయన చేస్తోన్న ప్రకటనలతోనే మద్దతు దారులు రెచ్చిపోయారని, అధ్యక్షుడిగా ఉంటూ.. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలపై స్వయంగా దాడిని ప్రోత్సహించిన నేరం కింద ట్రంప్ను తక్షణమే అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని డెమొక్రాట్లు పట్టుబడుతున్నారు. శనివారంనాడు తెల్లవారుజాము దాకా మంతనాలు సాగించిన డెమొక్రాట్ కాంగ్రెస్ సభ్యులు.. ఆయనను అభిశంసించే ప్రక్రియను సోమవారం మొదలుపెట్టాలని డిసైడయ్యారు. ''ట్రంప్ స్వచ్ఛందంగా వైదొలగాలి.. లేదంటే రెండోసారి అభిశంసించడానికి వెనుకాడం. ఇది మా నిర్ణయం. గద్దె దిగాలని ఇప్పటికే ఆయనకు స్ప ష్టం చేశాం'' అని స్పీకర్ నాన్సీ పెలోసీ మీడియాకు చెప్పారు.
దిగిపోయినా వదల బొమ్మాళి..
దేశంలో ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా తిరుగుబాటును ప్రోత్సహించి, దగ్గరుండి నడిపించిన ప్రెసిడెంట్ ట్రంప్.. పదవిలో కొనసాగడానికి అనర్హుడని అభిశంసన తీర్మానం ముసాయిదాలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. సోమవారంనాడు సభా కమిటీ ఈ అభిశంసన ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేసి తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. దీనిపై వచ్చే బుధ, గురువారాల్లో జరుగనుంది. హౌజ్ లో తీర్మానం ఆమోదం పొందిన తర్వాత అది సెనెట్కు వెళుతుంది. అయితే సెనెట్ ఈ బిల్లును విచారించేలోపే ట్రంప్ పదవీకాలం పూర్తవుతుంది. అయినాసరే, సదరు బిల్లును ముందుకు తీసుకెళ్లి, ట్రంప్ ను ఎలాగైనా అభిశంసించాలన్నది డెమొక్రాట్ల ఆలోచన. ఆశ్చర్యకరంగా ఈ ప్రతిపాదనకు రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రతినిధులు సైతం మద్దతు పలుకుతుండటం గమనార్హం.
తెంపరి ట్రంప్పై బైడెన్ ఔదార్యం
అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా ట్రంప్ ను వదల కూడదలని, ఆయన చేసిన తప్పులు, పాపాలకు శిక్షగా అభిశంసన చేసి తీరాల్సిందేనని డెమోక్రటిక్ పార్టీ గుర్రుగా ఉంది. కానీ ట్రంప్ పై ప్రతీకారం తీర్చుకునే విషయంలో జోబైడెన్ మాత్రం ఒకింత ఔదార్యం ప్రదర్శిస్తున్నారు. దీంతో జనవరి 20న బైడెన్ ప్రమాణస్వీకారం చేశాక.. ట్రంప్ అభిశంసన ప్రక్రియను ఆమోదిస్తారా లేదా అన్నది సందేహమే. ట్రంప్ పాలనలో నిలువునా చీలిపోయిన దేశాన్ని తిరిగి ఏకం చేస్తానని, రాజకీయాలతో సంబంధం లేకుండా దేశం యావత్తునూ ఒక్కతాటిపైకి తెస్తానని బైడెన్ ఇప్పటికే పలు మార్లు ప్రకటనలు చేసిన దరిమిలా, తన అధ్యక్ష పదవీకాల తొలినాళ్లలోనే ప్రతీకార చర్యలకు దిగబోనని, ప్రతికూల వాతావరణం, రిపబ్లికన్ పార్టీతో విభేదాలను కోరుకోవడం లేదని బైడెన్ తన అనుచరులతో గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది.
20 తర్వాత అమెరికాలో మార్పులివే..
ట్రంప్ ను అభిశంసించి, ఆయనపై ప్రతీకార చర్యలు తీసుకునే బదులు.. ఆ విలువైన సమయాన్నే దేశం బాగు కోసం వాడుకోవాలని బైడెన్ తన యంత్రాంగాన్ని ఆదేశించినట్లు సమాచారం. జనవరి 20న తాను బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచే పాలనా పరమైన మార్పులు కనిపించాలని బైడెన్ కోరుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా కొవిడ్ కార్యాచరణ, ఇమిగ్రేషన్ విధానాల మార్పులపై ఆయన ప్రధానంగా దృష్టి సారించి, వ్యవస్థలన్నింటినీ తిరిగి గాడిలో పెట్టాలనుకుంటున్నారు తప్ప రాజకీయ వ్యవహారాలపై ఆసక్తిగా లేరని సన్నిహిత వర్గాలు తెలిపాయి. విభేదాలు వద్దనుకుంటున్నారు కాబట్టే.. ప్రమాణ స్వీకారానికి హాజరుకాబోనంటూ ట్రంప్ చేసిన ప్రకటనను బైడెన్ లైట్ తీసుకోవడం, ట్రంప్ రాకపోవడమే మంచిదని వ్యాఖ్యానించారని మీడియా అభివర్ణించింది.