స్ఫూర్తి ప్రదాత మహాత్మాగాంధీ: అమెరికా చట్టసభల్లో బిల్లు.. ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు
వాష్టింగ్టన్ : జాతిపిత మహాత్మాగాంధీ పేరు అమెరికా చట్టసభల్లో వినిపించింది. మహాత్మాగాంధీ ప్రపంచానికి అహింసను చాటారంటూ ప్రతినిధుల సభ కొనియాడింది. ఆయన బోధనలను కొనియాడింది. మహాత్మాగాంధీతో పాటు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ను సైతం ఈ సందర్భంగా గుర్తుచేసుకుంది. మహాత్మాగాంధీ, మార్టిన్ లూథర్ కింగ్ ప్రపంచాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారని వారు చూపిన బాటను, బోధనలను ప్రమోట్ చేసేందుకుగాను ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలని కాంగ్రెస్ సభ్యుడు అమెరికా పౌరహక్కుల నేత జాన్ లూయిస్ సభలో కోరారు. రానున్న ఐదేళ్లకు బడ్జెట్లో 150 మిలియన్ డాలర్లు కేటాయించాలని అంటే ఏడాదికి 30 మిలియన్ డాలర్లు కేటాయించాలంటూ సభలో బిల్లును ప్రవేశపెట్టారు.
ధైర్యముంటే అమిత్ షా అక్కడ పర్యటించాలి: సోనియా గాంధీ
అమెరికా ప్రతినిధుల సభలో బిల్లు నెంబు హెచ్ఆర్ 5517ను ప్రవేశపెట్టడం జరిగింది. మహాత్ముడి 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా బిల్లు ప్రవేశపెట్టడం చరిత్రలో నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు. అంతేకాదు భారత్ అమెరికా మధ్య ఉన్న స్నేహబంధం ఈ బిల్లు ద్వారా మరింత బలపడుతుందని చెబుతున్నారు. అమెరికా చట్టసభల్లో ఇలాంటి చారిత్రాత్మకమైన బిల్లును ప్రవేశపెట్టడాన్ని స్వాగతించారు అమెరికాలో భారత రాయబారి హర్ష వర్ధన్ శృంగ్లా. ఇది రెండు దేశాల మధ్య ఉన్నసన్నిహిత సాంస్కృతిక మరియు సైద్ధాంతిక బంధాన్ని బలోపేతం చేస్తుందని చెప్పారు.
ఇక మహాత్మాగాంధీ-మార్టిన్ లూథర్ కింగ్ పేరుతో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేయాలని బిల్లులో ప్రతిపాదించారు.భారతీయ చట్టాలకు అనుగుణంగా దీన్ని యూఎస్ఎయిడ్ నియంత్రణలో ఉండాలని ప్రతిపాదించారు. ఈ ఫౌండేషన్ను ఆరుగురు డెమొక్రాట్లు స్పాన్సర్ చేస్తున్నారు. వీరంతా భారతీయ అమెరికన్లు కావడం విశేషం. అమెరికా భారత ప్రభుత్వాల నేతృత్వంలో పనిచేసే ఒక సమాఖ్యను ఏర్పాటు చేసి నిధులను పర్యవేక్షించాలని బిల్లులో ప్రతిపాదించారు. వీటిని ఆరోగ్యం, కాలుష్యం, వాతావరణంలో మార్పులు, విద్య, మహిళాసాధికారికత కోసం వినియోగించాలని సూచించారు.