డొనాల్డ్ ట్రంప్పై అభిశంసన: ఆమోదింపజేసేందుకు చట్ట సభ ప్రతినిధుల చర్చ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడి దేశానికి ద్రోహం చేసినందుకే ఆయనపై అభిశంసనకు సిద్ధమమైనట్లు ప్రతిపక్ష డెమోక్రాటిక్ పార్టీ స్పష్టం చేసింది. కాగా, బుధవారం జాతీయ సభలో ట్రంప్పై పెట్టిన అభిశంసనపై చర్చ జరిగింది.
ట్రంప్పె పెట్టిన రెండు అభిశంసన తీర్మానాలను ఆమోదింపజేసేందుకు చట్టసభ్యులు చర్చలో పాల్గొన్నారు. అంతకుముందు ట్రంప్పై అభిశంసన ప్రక్రియను ఆ పార్టీ సహేతుకంగా సమర్థించుకుంటూ ప్రతినిధుల సభలో ఒక ప్రకటన విడుదల చేసింది.
ట్రంప్పై నమోదు చేసిన అభిశంసన అభియోగాలపై ప్రతినిధుల సభలో ఓటింగ్ జరుగనుండటంతో డెమోక్రాట్లు ఈ ప్రకటన విడుదల చేసినట్లు తెలుస్తోంది. ట్రంప్ తన రాజకీయ ప్రయోజనాల కోసం దేశ ద్రోహానికి పాల్పడ్డారని.. ఆయన్ను అభిశంసించడం సహేతుకమేనని డెమోక్రాటిక్ పార్టీ తన ప్రకటనలో తెలిపింది.
ఇది ఇలావుంటే, డొనాల్డ్ ట్రంప్పై పెట్టిన అభిశంసనకు భారీ ఎత్తున ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. ప్రతినిధుల సభలో ఓటింగ్ చేపట్టిన సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను పదవి నుంచి తొలగించాలంటూ వేలాది మంది నిరసన ప్రదర్శనలు చేపట్టారు. న్యూయార్క్ నగర వీధుల్లో ప్లేకార్డులు పట్టుకుని తమ నిరసన తెలియజేశారు.
2020 అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెంట్ పదవికి పోటీ పడుతున్న జో బిడెన్పై దర్యాప్తు చేపట్టాలని ఉక్రెయిన్ అధినేతను ట్రంప్ కోరడంతో చట్టసభల్లో అభిశంసన ప్రవేశపెట్టారు. అభిశంసన ఎదుర్కొంటున్న మూడో అధ్యక్షుడిగా ట్రంప్ రికార్డుల్లోకి ఎక్కనున్నారు.