అభిశంసన తీర్మానం: ట్రంప్ గట్టెక్కుతారా..? ఆసక్తికరంగా అమెరికా పాలిటిక్స్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇబ్బందులు తప్పవా..? అతనిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలంటూ స్పీకర్ వద్దకు పిటిషన్ దాఖలు కావడం తెలిసిందే. అయితే ప్రతినిధుల సభ ఇందుకు ఆమోదం తెలపాల్సి ఉండగా ఇప్పుడు అది కూడా జరిగిపోయింది. దీంతో ట్రంప్పై అభిశంసన తీర్మానం జరిగే ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ లభించింది.
బాగ్దాది
వారసుడిని
కూడా
మట్టుబెట్టాం:
డొనాల్డ్
ట్రంప్
ట్వీట్
ప్రతినిధుల సభలో మెజార్టీ ఓట్లు
అమెరికా కాంగ్రెస్లోని ప్రతినిధుల సభ ట్రంప్ అభిశంసన తీర్మానం ప్రక్రియ కొనసాగేందుకు జరిగిన ఓటింగ్లో తీర్మానంకు అనుకూలంగా మెజార్టీ ఓట్లు పడ్డాయి. ప్రతినిధుల సభలో డెమొక్రాటిక్ పార్టీకి 233 స్థానాలు ఉండగా.. రిపబ్లికన్ పార్టీకి 197 స్థానాలు ఉన్నాయి. ట్రంప్ కూడా రిపబ్లికన్ పార్టీకి చెందిన నేత. ఇప్పటివరకు అమెరికా చరిత్రలో ఇద్దరి అధ్యక్షుల పైనే అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టడం జరిగింది. ఇందులో ఒకరు ఆండ్రూ జాన్సన్ కాగా మరొకరు బిల్ క్లింటన్. అయితే ఇద్దరి పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టినప్పటికీ అది నెగ్గలేదు.
సెనేట్లో ట్రంప్ పార్టీకి మెజార్టీ సీట్లు
ఇక 100 మంది ఉన్న సెనేట్లో ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి 53 సీట్లు ఉండగా డెమొక్రటిక్ పార్టీకి 47 సీట్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రతినిధుల సభలో డెమొక్రటిక్ పార్టీకి ఎక్కువ సీట్లు ఉన్నందున అక్కడ అభిశంసన తీర్మానం నెగ్గినా సెనేట్లో రిపబ్లికన్ పార్టీకి ఎక్కువ సంఖ్యాబలం ఉండటంతో ఇక్కడ ట్రంప్ పార్టీదే పై చేయి అయ్యే అవకాశం ఉంది. అభిశంసన తీర్మానం ప్రక్రియతో అమెరికా రాజకీయాల్లో వేరుబంధనాలు ఏర్పడ్డాయి. భవిష్యత్తులో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధమే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రంప్ ప్రభుత్వానికి డిఫెండ్ చేసుకునే అవకాశం లేకుండా చేయాలనేది డెమొక్రాట్ల ప్లాన్ ఉండగా ట్రంప్ ఎలాంటి తప్పు చేయలేదని వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ స్టెఫాన్ గ్రీషం తెలిపారు. అభిశంసన తీర్మానం పేరుతో డెమొక్రాట్లు సమయం వృథా చేస్తున్నారని మండిపడ్డారు.
అభిశంసన తీర్మానంతో సమయం వృథా
డెమొక్రాట్లు తనపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ట్రంప్ ఆరోపించారు. తను ఏ తప్పు చేయలేదని డెమొక్రాట్లకు తెలుసునని ఆయన అన్నారు. అభిశంసన తీర్మానంతో సాధించేది ఏమీ లేదని చెప్పిన ట్రంప్ అమెరికా స్టాక్ మార్కెట్లపై ఆ ప్రభావం చూపుతోందని అన్నారు. ఒక వ్యక్తిని దేశాధ్యక్షుడిగా ఎన్నుకున్న తర్వాత అతన్ని తొలగించాలనే ప్రయత్నాలు మంచిది కాదని అన్నారు ట్రంప్ 2020 క్యాంపెయిన్ మేనేజర్ బ్రాడ్ పార్స్కేల్. ఈ అభిశంసన తీర్మానంను ప్రోత్సహించడం ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసికి సరికాదన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడితో ట్రంప్ ఫోన్ సంభాషణలు వింటే అందులో క్విడ్ ప్రోకో ఎక్కడా కనిపించలేదని బ్రాడ్ అన్నారు. 2020లో డెమొక్రాట్లకు ప్రజలు బుద్ధి చెబుతారని చెప్పిన బ్రాడ్.. తిరిగి అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికవుతారనే ధీమా వ్యక్తం చేశారు.