ఇరాన్పై కొత్త ఆర్థిక ఆంక్షలు విధించిన అమెరికా...ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ సంతకం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై మరిన్ని కఠిన ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకాలు చేశారు. కొత్తగా విధించిన ఆంక్షల ప్రకారం అమెరికా ఆర్థిక సంస్థల నుంచి ఇరాన్ సుప్రీం కానీ ఇతర ఉన్నతాధికారులు కానీ ఎలాంటి సహాయం పొందబోరని చెబుతున్న ఆర్డర్పై ట్రంప్ సంతకం చేశారు. అమెరికాకు చెందిన నిఘా డ్రోన్ను ఇరాన్ కూల్చివేసిన రెండ్రోజులకే ట్రంప్ ఆంక్షలు విధించడం చర్చనీయాంశమైంది. చర్యకు ప్రతిచర్యగా ఇరాన్పై క్షిపణి దాడికి సిద్ధపడ్డ అగ్రరాజ్యం చివరి నిమిషంలో మనసు మార్చుకుంది.
ఇదిలా ఉంటే ఇరాన్తో కానీ ఇతర దేశాలతో కానీ అమెరికా వైరం కోరదని ట్రంప్ చెప్పారు. అదే సమయంలో అణ్వాయుధాలు కలిగి ఉంటే మాత్రం సహించేది లేదంటూ హెచ్చరించారు. ఇప్పటికే ఇరాన్ పట్ల అమెరికా ఎంతో ఓర్పుతో సహనంతో వేచిచూసిందని.. ఎప్పుడూ అలానే ఉంటుందనుకోవడం పొరపాటని ట్రంప్ అన్నారు. ఇరాన్ చర్యకు ప్రతిచర్యగానే ఈ ఆంక్షల నిర్ణయం తీసుకున్నారా అన్న ప్రశ్నకు ట్రంప్ అలానే అనుకోవచ్చు అని సమాధానం ఇచ్చారు. ఓ వైపు ఇరాన్కు చురకలు అంటిస్తూనే మరోవైపు తెలివిని ప్రదర్శించారు ట్రంప్. న్యూయార్క్లో చాలామంది ఇరానీయులు నివసిస్తున్నారని వారంతా మంచి మనుషులని కొనియాడారు.
అమెరికా విధించిన ఆంక్షలతో ఒక్క చర్చలు తప్ప ఇరాన్కు మరో ఆప్షన్ లేదని అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పొంపే తెలిపారు.వారు చర్చలు జరిపేందుకు అంగీకరించేవరకు ఇరాన్పై ఆంక్షలు ఇతర ఆర్థిక ఆంక్షలు కొనసాగుతాయని పొంపే చెప్పారు. అంతకుముందు ఇరాన్కు బుద్ది చెప్పాలన్న ఉద్దేశంతో అమెరికా కంటిన్జెన్సీ ప్లాన్ రూపొందించింది. దాని ప్రకారం ఇరాన్ దేశ రాకెట్, మిసైల్ లాంఛర్లను నియంత్రించే కంప్యూటర్ వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. ముఖ్యంగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కంప్యూటర్లను టార్గెట్ చేసింది. ట్రంప్ అధికారం చేపట్టిన నాటి నుంచి అమెరికా అధికారులు శత్రువులను ఎక్కువగా సైబర్ రంగంలోనే లక్ష్యంగా చేసుకున్నారు.