భారత్ దారి చూపింది.. అమెరికా అనుసరించబోతోంది: టిక్టాక్ సహా అన్ని చైనా యాప్లపై బ్యాన్
వాషింగ్టన్: భారత్.. అగ్రరాజ్యం అమెరికాకు దారి చూపిస్తోంది. సరిహద్దు వివాదాలను అడ్డుగా పెట్టుకుని కయ్యానికి కాలు దువ్వుతోన్న చైనా దూకుడును అడ్డుకోవడంలో వ్యాపార, వాణిజ్యపరమైన అన్ని సంబంధాలను తెంచుకుంది భారత్. ఇందులో భాగంగా డ్రాగన్ కంట్రీపై డిజిటల్ స్ట్రైక్ చేసింది. అత్యంత జనాదరణ పొందిన టిక్టాక్ సహా చైనా రూపొందించిన అన్ని యాప్లనూ నిషేధించింది. చైనాతో సంబంధాలను తెంచుకోవాలనుకునే దేశాలకు భారత్ ఓ మార్గాన్ని చూపించింది.
Recommended Video
విదేశీ విద్యార్థులపై బాంబు పేల్చిన అమెరికా: స్వదేశానికి తిరుగుముఖం పట్టాల్సిందే: విసాలన్నీ..
తాజాగా ఇప్పుడు అదే బాటలో ప్రయాణించడానికి సిద్ధపడుతోంది అమెరికా. భారత్ తరహాలోనే చైనా యాప్లను నిషేధించే దిశగా చర్యలను తీసుకోవడానికి సన్నాహాలు చేస్తోంది. టిక్టాక్ సహా కొన్ని యాప్ల వల్ల అమెరికన్ పౌరుల వ్యక్తిగత సమాచారం చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకుల చేతుల్లోకి వెళ్తోందంటూ కొద్దిరోజులుగా అమెరికాలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. భద్రతాపరంగా కూడా చైనా యాప్లు మంచివి కావనే అభిప్రాయం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని చైనా యాప్లను నిషేధించే దిశగా అమెరికా అడుగులు వేస్తోంది.
చైనా యాప్ల వినియోగాన్ని తమ దేశంలో నిషేధించే అంశాన్ని తాము తీవ్రంగా పరిశీలిస్తున్నామని అమెరికా స్టేట్ సెక్రెటరీ మైక్ పాంపియో ప్రకటించారు. ప్రత్యేకించి- టిక్టాక్పై వీలైనంత త్వరగా నిషేధాన్ని విధించగలమని ఆయన చెప్పారు. ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. చైనా యాప్లపై సరైన నిర్ణయాన్ని తీసుకోకుండా తాను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షానికి వెళ్లబోనని అన్నారు.
త్వరలోనే దీనిపై ఓ నిర్ణయాన్ని తీసుకుంటామని స్పష్టం చేశారు. చైనా యాప్ల వల్ల వ్యక్తిగత సెల్ఫోన్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారం మొత్తం చోరీ అవుతోందనే విషయాన్ని మైక్ పాంపియో పరోక్షంగా అంగీకరించారు. అలాంటి యాప్లను నిషేధించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పుకొచ్చారు. ఇదే అంశం మీద కొందరు చట్టసభల సభ్యులు కూడా తమ స్పందనను వ్యక్తం చేశారని, బ్యాన్ చేయాలనే డిమాండ్ చేస్తున్నారని అన్నారు.
చైనా యాప్లపై నిషేధాన్ని విధించిన తరువాత పలు దేశాలు భారత్ చర్య తీసుకున్న చర్యలను ప్రశంసించాయి. అందులో అమెరికా కూడా ఉంది. టిక్టాక్ సహా 59 యాప్లను భారత్ కొద్దిరోజుల కిందటే నిషేధించింది. తమ యాప్లను నిషేధించడంపై చైనా కూడా స్పందించింది. తమను డేటా చోరీదారుడిగా పేర్కొనడాన్ని తప్పు పట్టింది. దీనికి ప్రతికార చర్యగా భారత్కు సంబంధించిన కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను బ్యాన్ చేసింది డ్రాగన్ కంట్రీ.