మాకే వ్యతిరేకంగానా? సరే, గుర్తుంచుకుంటాం.., ప్రపంచదేశాలకు అమెరికా షాక్!
న్యూయార్క్: అమెరికాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి వేదికగా ప్రపంచ దేశాలు ఒక్కటవ్వడాన్ని అగ్రరాజ్యం సహించలేకపోతోంది. ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ ఆదివారం చేసిన ఒక కీలక ప్రకటన అమెరికా వైఖరికి అద్దం పడుతోంది.
ప్రపంచదేశాలన్నీ ఒక్కటి కావడంతో ఏం చేయాలో అర్థంకాక ఆ ఉడుకుమోతు తనాన్ని అమెరికా ఐక్య రాజ్యసమితిపై చూపించింది. వచ్చే ఏడాది ఐరాసకు కేటాయించనున్న బడ్జెట్లో 285 మిలియన్ డాలర్ల మేర కోత విధించనున్నట్లు ప్రకటించింది.
అంతేకాదు, ''ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రపంచ దేశాలన్నీ ఒక్కటయ్యాయని, అమెరికాను ఒంటరి చేశాయని, ఈ కారణంగానే ఐరాస బడ్జెట్లో కోత విధిస్తున్నాం..'' అని నిక్కీ హేలీ నిస్సిగ్గుగా ప్రకటించారు.
అసలేం జరిగిందంటే... జెరూసలేం నగరాన్ని ఇజ్రాయెల్ రాజధానిగా అధికారికంగా గుర్తిస్తున్నామని, అమెరికన్ ఎంబసీని జెరూసలేంకు మార్చుతున్నామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్దిరోజులు క్రితం ప్రకటించారు.
ట్రంప్ ప్రకటనను నిరసిస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లిం దేశాల్లో అల్లర్లు, ఆందోళనలు చెలరేగడంతో అమెరికా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ఐరాసలో ప్రవేశపెట్టిన తీర్మానికి ప్రపంచ దేశాలన్నీ సంపూర్ణంగా మద్ధతు ప్రకటించాయి.
దీంతో ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ ఆవేశంగా మాట్లాడారు. ''అమెరికా చరిత్రలో ఇది మరచిపోలేని రోజు.. అమెరికాకు వ్యతిరేకంగా నిలిచిన అన్నీ దేశాలను గుర్తుపెట్టుకుంటాం..'' అని ఆమె వ్యాఖ్యానించారు.
ఆ వెంటనే ఐరాస నిధుల్లో కోత విధిస్తున్నట్లు ప్రకటించడంతో ప్రపంచ దేశాలు షాక్కు గురయ్యాయి. ఈ చర్యతో అగ్రరాజ్యం అమెరికా అసలు రంగు బయటపడింది కూడా. తనకు ఎదురు చెప్పే, నిలిచే దేశాలను అమెరికా సహించలేదని అర్థమవుతోంది.