జీహాదీ జాన్ అంతు చూస్తున్న అమెరికా సైన్యం
వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులలో అతి కరుడుగట్టిన ఉగ్రవాదిగా పేరు తెచ్చుకున్న జీహాదీ జాన్ అలియాస్ మహమ్మద్ ఎమ్వాజీ అంతు చూసేందకు అమెరికా సైనికులు వైమానిక బాంబు దాడులు చేస్తున్నారు.
వివిధ దేశాలకు చెందిన వేలమంది బందీల కంఠాలను తెగకోసిన జీహాదీ జాన్ ను ఎలాగైనా అంతం చెయ్యాలని గురువారం అమెరికా మిలటరి సేనలు బాంబు దాడులు చేశారు. మొదట జీహాదీ జాన్ ఉన్నట్లు భావించిన ప్రాంతాలలో అమెరికా సైన్యం వైమానిక దాడులు నిర్వహించింది.
ఈ మేరకు పెంటగాన్ మీడియా సెక్రటరి పీటర్ కుక్ ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ దాడులలో జీహాదీ జాన్ చనిపోయాడా లేదా అని ఆ ప్రకటనలో స్పష్టం చెయ్యలేదు. జీహాదీ జాన్ తలదాచుకున్నాడని సేకరించిన సమాచారంతో తాము దాడులు నిర్వహించామని తెలిపారు.
అయితే దాడులు జరిగిన ప్రాంతాలలో పరిస్థితిని అంచనా వేస్తున్నామని, జీహాదీ జాన్ మృతి చెందాడా లేదా అని కచ్చితంగా తెలియడం లేదని, తెలిసిన వెంటనే తాము అధికారికంగా వివరాలు వెల్లడిస్తామని పెంటాగాన్ మీడియా సెక్రటరి పీటర్ కుక్ ప్రకటనలో తెలిపారు.
సిరియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అధికంగా ఉండే రఖా అనే ప్రాంతంలో అమెరికా సైనిక వర్గాలు వైమానిక దాడులు జరిపారని స్పష్టం చేశారు. కువైట్ లోని ఇరాక్ కుటుంబంలో జన్మించిన మహమ్మద్ ఎమ్వాజీ లండన్ లో కంప్యూటర్ ప్రోగ్రామర్ గా పని చేశాడు.
తరువాత ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదానికి ఆకర్షితుడై ఐఎస్ఐఎస్ లో చేరాడు. అన్ని దేశాలకు చెందిన బందీలను అతి కిరాతకంగా వధించాడు. ప్రపంచంలోనే అతి క్రూరమైన ఉగ్రవాదిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తన పేరును జీహాదీ జాన్ గా ప్రకటించుకున్నాడు. జీహాదీ జాన్ ను అంతం చెయ్యాలని అమెరికా నిర్ణయించింది.