అమెరికా వ్యూహానికి దిగొచ్చిన చైనా, వార్నింగ్ కూడా!
నార్త్ కొరియా ఇన్నాళ్లు క్షిపణి పరీక్షలు చేస్తున్నా ఏమీ తెలియనట్టు ఉన్న చైనాలో కదలిక వచ్చింది.
వాషింగ్టన్: నార్త్ కొరియా ఇన్నాళ్లు క్షిపణి పరీక్షలు చేస్తున్నా ఏమీ తెలియనట్టు ఉన్న చైనాలో కదలిక వచ్చింది. అమెరికాకు చెందిన హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ సిస్టం (థాడ్)ను సౌత్ కొరియాలో ఏర్పాటు చేయటం ప్రారంభించగానే చైనా తీరులో మార్పు వచ్చింది.
పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు నార్త్ కొరియా క్షిపణి, అణు కార్యక్రమాలను రద్దు చేసుకోవాలని చైనా ప్రతిపాదించింది. దీనికి ప్రతిగా అమెరికా-దక్షిణ కొరియాలు ఏటా నిర్వహించే సంయుక్త సైనిక విన్యాసాలను నిలిపివేయాలని సూచించింది.
ఈ విషయాన్ని చైనా విదేశాంగ శాఖ మంత్రి వార్షిక పార్లమెంట్ సమావేశాల్లో తెలిపారు. అమెరికా - కొరియాల తీరు వేగంగా ప్రయాణించే రైళ్లు ఎదురెదురుగా వస్తున్నట్లు ఉందని ఆయన వాఖ్యానించారు. వీరద్దరూ సైనిక కార్యకలాపాలు నిలిపివేయటమే ఉద్రిక్తతల తగ్గింపునకు తొలిమెట్టవుతుందన్నారు.
నార్త్ కొరియా క్షిపణి జపాన్ ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్లో కూలినప్పుడు అమెరికా, జపాన్లు తీవ్రంగా స్పందించాయి. జపాన్ ప్రధాని షింజో అబే, అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్లు.. ముప్పు కొత్త స్థాయికి చేరిందని మండిపడ్డారు.
చైనా ఆగ్రహం
అదే సమయంలో దక్షిణ కొరియాలో క్షిపణి రక్షక వ్యవస్థ ఏర్పాటును చైనా వ్యతిరేకిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి జెంగ్ షౌంగ్ మంగళవారం అన్నారు.
ఈ వ్యవస్థ ఏర్పాటు కోసం ఇప్పటికే అమెరికా మిసైల్ లాంచర్లు, ఇతర సామాగ్రి సౌత్ కొరియా చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో తమ దేశ భద్రత ప్రయోజనాలను కాపాడుకునందుకు చైనా కచ్చితంగా అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు.