పీకల్లోతు అప్పుల్లో అగ్రరాజ్యం అమెరికా..భారత్ కు ఎంత ఇవ్వాలంటే..
అగ్రరాజ్యం అమెరికా అప్పులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఆ దేశానికి ఉన్న అప్పుల్లో అధికశాతం అన్ని రంగాల్లోనూ సవాల్ విసురుతున్న చైనా నుంచి ఉన్నాయని ఆ దేశ కీలక చట్టసభ సభ్యులు అలెక్స్ మూనీ అక్కడి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. కరోనా సంక్షోభం తర్వాత అగ్రరాజ్యం అమెరికా పీకల్లోతు అప్పుల్లో కూరుకు పోతుంది అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
భారతదేశానికి 216 బిలియన్ డాలర్లు రుణపడి ఉన్న అమెరికా
భారతదేశానికి సైతం 216 బిలియన్ డాలర్లు రుణపడి ఉన్నట్లుగా వెల్లడించారు. రెండు ట్రిలియన్ డాలర్ల విలువచేసే కరోనా ఉద్దీపన పథకాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి చట్టసభలో మూనీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత అమెరికా దేశపు అప్పు 29 ట్రిలియన్ డాలర్లకు చేరినట్లుగా మూనీ వెల్లడించారు. 2020 నాటికి అమెరికా జాతీయ అప్పులు 23.4 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నాయని, ఆ దేశంలో ఒక్కొక్కరి పై సగటున 72,309 డాలర్లు అప్పు ఉన్నట్లుగా మూనీ వెల్లడించారు.
చైనా, జపాన్ లకే ఎక్కువ రుణపడి ఉన్న యూఎస్
ఇక గత ఏడాది కాలంలో తీసుకున్న అప్పు ఒక్కరికి పంచితే పదివేల డాలర్ల వరకు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అమెరికా దేశం తీసుకువచ్చిన రుణాలన్నీ ఎక్కడికి వెళుతున్నాయి అన్న వివరాలు కూడా తప్పుగా ఉన్నాయని అలెక్స్ మూనీ ఆరోపించారు. అమెరికాకు మిత్ర దేశాలు కాని చైనా, జపాన్ లకే ఎక్కువ రుణపడి ఉన్నాయని వెల్లడించారు. ఈ రెండు దేశాల్లో ఒక్కొక్క దానికి ఒక ట్రిలియన్ డాలర్లకు పైగా అమెరికా అప్పు ఉందని తెలిపారు.
కొత్త ఉద్దీపన పథకం ఆమోదించే ముందు ఆలోచించాలన్న చట్ట సభ్యుడు అలెక్స్ మూనీ
ఇక అమెరికా అప్పులను చూసినట్లయితే 2000 సంవత్సరంలో 5.6 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న అమెరికా అప్పులు, ఒబామా హయాంలో రెండింతలు అయినట్లుగా మూనీ తెలిపారు .దీనిని రోజురోజుకీ పెంచుతూ పోతున్నామని, జీడీపీలో అప్పుల నిష్పత్తి నియంత్రణలో లేకుండా పోతోందని మూనీ వెల్లడించారు . ఇక కరోనా కారణంగా కొత్త ఉద్దీపన పథకాన్ని ఆమోదించే ముందు వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకోవాలని ఆయన చట్ట సభ్యులను కోరారు. కరోనా ఉద్దీపన పథకం లోనూ చాలా వరకు నిధులు కరోనా ఉపశమన పథకాలకు వెళ్లబోవని మూనీ ఆరోపణలు గుప్పించారు.