ట్రంప్ భారత పర్యటన తేదీలు ఖరారు: అహ్మదాబాద్లో పారిశ్రామికవేత్తలతో.. !
న్యూఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ దాదాపు ఖరారైంది. ఫిబ్రవరిలో ఆయన భారత్లో పర్యటిస్తారంటూ ఇదివరకు వార్తలు వచ్చినప్పటికీ.. దీనికి సంబంధించిన తేదీలు వెల్లడి కాలేదు. వచ్చేనెల 21 నుంచి 24 తేదీల్లో ట్రంప్.. భారత్లో పర్యటిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు అనధికారికంగా వెల్లడిస్తున్నారు. ఈ తేదీలను వైట్హౌస్ ఇంకా ధృవీకరించాల్సి ఉందని చెబుతున్నారు.
అహ్మదాబాద్లో పర్యటించనున్న ట్రంప్..
తన మూడు రోజుల భారత పర్యటన సందర్భంగా డొనాల్డ్ ట్రంప్.. గుజరాత్ ఆర్థిక రాజధాని అహ్మదాబాద్లో పర్యటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూడు రోజుల పాటు ట్రంప్.. నరేంద్ర మోడీతో అత్యున్నత స్థాయి సమావేశాలను నిర్వహిస్తారు. న్యూఢిల్లీ, అహ్మదాబాద్ ఈ భేటీకి వేదికగా మారే అవకాశాలు ఉన్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు. అహ్మదాబాద్లో భారత్కు చెందిన పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలు ట్రంప్ను కలుసుకుంటారని అంటున్నారు.
ఐటీసీ మౌర్య బుక్..
అమెరికా అధ్యక్షుడి పర్యటనను దృష్టిలో ఉంచుకుని న్యూఢిల్లీలోని ఐటీసీ మౌర్య స్టార్ హోటల్లోని పలు గదులను అధికారులు ముందుగా బుక్ చేసినట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి ఈ హోటల్లోని ప్రెసిడెన్షియల్ సూట్ను అధికారులు బుక్ చేశారని అంటున్నారు. ఇదే ప్రెసిడెన్షియల్ సూట్లో ఇదివరకు బారక్ ఒబామా, బిల్ క్లింటన్ బస చేశారు. ట్రంప్, నరేంద్ర మోడీ భేటీల సందర్భంగా పలు వాణిజ్య ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి.