మరణానికి మానసికంగా సిద్ధం: డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం: వేల సంఖ్యలో జవాన్లు
న్యూయార్క్: వచ్చే రెండు వారాల అత్యంత కఠిన రోజులంటూ ఇప్పటికే మరణానికి మానసికంగా సిద్ధ పడిన అమెరికాలో పరిస్థితులు మరింత సంక్లిష్టమౌతున్నాయి. ఈ రెండు వారాల్లో ఎలాంటి దారుణాలను చవి చూడాల్సి వస్తుందోననే భయాందోళనలు వ్యక్తమౌతోన్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆర్మీ బలగాలను రంగంలోకి దించారు. కరోనా వైరస్ బారిన పడిన అన్ని రాష్ట్రాల్లోనూ ఇప్పుడున్న పోలీసు బలగాలకు అదనంగా సైన్యాన్ని పంపించారు.
భారత్ను అర్థించిన అమెరికా: ఆ డ్రగ్ను వెంటనే పంపించాలంటూ మోడీని కోరిన ట్రంప్: బహిరంగంగా..!
న్యూయార్క్లోనే వెయ్యి మందికి పైగా..
అమెరికా ఆర్థిక రాజధానిగా గుర్తింపు తెచ్చుకున్న న్యూయార్క్ ప్రస్తుతం భయానక స్థితికి చేరింది. ఈ ఒక్క రాష్ట్రలోనే లక్షా 14 వేల మందికి పైగా స్థానికులు కరోనా వైరస్ బారిన పడ్డారు. 3,500 మందికి పైగా మరణించారు. ఇలాంటి భీతావహ వాతావరణంలో ఒక్క న్యూయార్క్కే 1000 మంది వరకు జవాన్లను మోహరింపజేశారు. న్యూజెర్సీ, మిచిగాన్, కాలిఫోర్నియా, లూసియాానా, మసాచుసెట్స్ వంటి రాష్ట్రాలకు ఇంచుమించు అదే సంఖ్యలో జవాన్లను పంపించారు.
పరిస్థితులను అదుపులో ఉంచడానికే..
కరోనా వైరస్ విజృంభణ అనంతరం అమెరికాలో నెలకొన్న పరిస్థితులను అదుపులోకి తీసుకుని రావడానికే వేలాదిమంది జవాన్లను ఆయా రాష్ట్రాలకు తరలించినట్లు అధికారులు చెబుతున్నారు. వచ్చే రెండు వారాల్లో మృతుల సంఖ్య రెండులక్షలకుపైగా చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ వార్తలు వెలువడుతున్న తరుణంలో రాష్ట్రాల్లో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పే ప్రమాదం ఉందని, అందుకే- జవాన్లను మోహరింపజేశామని అంటున్నారు.
వైద్య పరికరాల కొరత వల్ల
కరోనా వైరస్ పాజిటివ్ పేషెంట్లకు వైద్య చికిత్సను అందించడానికి అవసరమైన వైద్య పరికరాలు అందుబాటులో లేకపోవడం వల్ల కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, వాటిని నివారించడానికే జవాన్లను పంపించారనే వాదనలు ఉన్నాయి. మాస్కులు, వెంటిలేటర్ల వంటి పరికరాల కోసం ఎగబడే అవకాశాలు ఉన్నాయని, దీన్ని నివారించడానికి ప్రభుత్వం ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ (ఫెమా), డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ సోషల్ సర్వీసెస్ ఇప్పటికే 180 మిలియన్ల ఫేస్ మాస్కులు, 29 మిలియన్ డోసుల యాంటీ మలేరియన్ డ్రగ్ హైడ్రాక్సిక్లొరోక్విన్కు ఆర్డర్ ఇచ్చింది.
అమెరికన్లకే మాస్కులు..
అమెరికన్లకు మాత్రమే మాస్కులు, ఇతర వైద్య పరికరాలు, మందులను పంపిణీ చేయడానికి అక్కడి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమకు అందాల్సిన మాస్కులను అమెరికా తస్కరించిందంటూ ఇప్పటికే జర్మనీ ఆరోపించింది. ఇలాంటి ఆరోపణలు, విమర్శలను దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకూ అదనంగా సైనిక బలగాలను తరలించిందని చెబుతున్నారు.