900 బిలియన్ డాలర్ల భారీ ప్యాకేజీ: షట్డౌన్ను నిలువరించి డొనాల్డ్ ట్రంప్ సంతకం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. కరోనా వైరస్ సృష్టించిన విధ్వంస పరిస్థితులను అధిగమించడానికి, దాని బారిన పడిన వారి సంక్షేమానికి ఉద్దేశించిన భారీ ఆర్థిక బిల్లుపై సంతకం చేశారు. ఈ కోవిడ్ 19 రిలీఫ్ బిల్లు విలువ 900 బిలియన్ డాలర్లు. ఈ సంతకం చేయడానికి ఆయన వారం రోజుల పాటు టెన్షన్ పెట్టారు. తొలుత సంతకం చేయడానికి భీష్మించారు. ఈ బిల్లుపై ఆయన సంతకం చేయకపోయి ఉంటే మంగళవారం నుంచి అమెరికాలో షట్డౌన్ తరహా పరిస్థితులు ఏర్పడి ఉండేవి.
టీమిండియా మళ్లీ పాతకథ: 32 పరుగులకే చివరి అయిదు వికెట్లు:
కరోనా వైరస్ వల్ల తలెత్తిన సంక్షోభ పరిస్థితులను అడ్డుకోవడానికి ఉద్దేశించిన ఉద్దీపన బిల్లు ఇది. ఉపాధి, వ్యాపారాలను కోల్పోయిన వారికి ఆర్థిక సహకారాన్ని అందించడంతో పాటు కరోనా వల్ల దెబ్బతిన్న వాణిజ్య రంగాలకు చేయూతను ఇవ్వడానికి 900 బిలియన్ డాలర్ల ప్యాకేజీతో ఈ బిల్లును రూపొందించారు. దీనికి అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. తుది సంతకం కోసం అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్హౌస్కు పంపించింది.
దీనిపై సంతకం చేయడానికి డొనాల్డ్ ట్రంప్ తొలుత నిరాకరించారు. వారం రోజుల పాటు జాప్యం చేశారు. ఇందులో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ట్రంప్ అన్నారు. బిల్లులో ఉన్న అనవసరమైన అంశాలను తొలగించాల్సి ఉందంటూ బాంబు పేల్చారు. ఉద్దీపన ప్యాకేజీ నిరుద్యోగులను అవమానించేదిలా ఉందని అప్పట్లో ఆయన వ్యాఖ్యనించారు. నిరుద్యోగులతో పాటు వ్యాపారులకు ఊరట కలిగించే అంశాలేవీ అందులో లేవంటై మొండికేశారు.
అనంతరం ఆయనపై పలు రకాల ఒత్తిళ్లు వచ్చాయి. దీనితో ఈ బిల్లుపై సంతకం చేశారు. తాను కొద్దిసేపటి కిందటే ఆర్థిక ప్యాకేజీ ఉద్దీపన బిల్లుపై సంతకం చేశానని ట్రంప్ వెల్లడించారు. 900 బిలియన్ డాలర్ల విలువ చేసే ఈ ప్యాకేజీ వల్ల అమెరికన్లు మళ్లీ కరోనా వైరస్ పూర్వపు స్థితికి చేరుకోగలుగుతారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఈ బిల్లు ఉపకరిస్తుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.