జో బిడెన్ తొలి కొరడా: తప్పు తెలుసుకునేలా చేస్తా: వారం రోజుల డెడ్లైన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బిడెన్.. తొలి కొరడా ఝుళిపించారు. సైనిక పాలనలోకి వెళ్లిన మియన్మార్పై కఠిన ఆంక్షలను విధించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన మియన్మార్ మిలటరీ.. ప్రభుత్వాన్ని నెలకొల్పడం పట్ల నిరసనను తెలిపారు. తాజా ఆంక్షలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన రెండు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ఆయన సంతకం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నియంతృత్వానికి తావు లేదని, తేల్చి చెప్పారు. తన తప్పును తెలుసుకుని..దిద్డుబాటు చర్యలను తీసుకోకపోతే.. మున్ముందు మరిన్ని ఆంక్షలు తప్పబోవని జో బిడెన్ హెచ్చరించారు.
వందలాది మంది అరెస్టులతో
గత ఏడాది నవంబర్లో మియన్మార్లో నిర్వహించిన ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసకున్నాయని, అంగ్సాన్ సూకీ సారథ్యంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన అక్కడి మిలటరీ అధికారులు.. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అంగ్సాన్ సూకీ, దేశాధ్యక్షుడు విన్ మియింట్ను అరెస్ట్ చేశారు. నిర్బంధంలో ఉంచారు. మిలటరీ చీఫ్ మిన్ ఆంగ్ హ్లెయింగ్.. అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించారు.
సైనిక పాలనకు నిరసనగా..
సైనిక పాలనకు నిరసనగా వేలాదిమింది ప్రజలు రోడ్డెక్కారు. నిరసన ప్రదర్శనలను చేపట్టారు. నిరసన ప్రదర్శనలు, ఆందోళనలపై నిషేధాన్ని విధించినప్పటికీ.. దాన్ని ధిక్కరిస్తున్నారు. ఆందోళనకారులను అడ్డుకోవడానికి పెద్ద ఎత్తున పోలీసులు, సైనికులను మోహరింపజేసింది సైనిక ప్రభుత్వం. జాతీయ భద్రతా బలగాలను రంగంలోకి దిపింది. నిరసనకారులపై పోలీసులు రబ్బరు బుల్లెట్ల వర్షం కురిపించారు. వారి ఆందోళనలు రోజురోజుకు మరింత తీవ్రతరమౌతోన్నాయి.
జోక్యం చేసుకున్న అమెరికా..
ఈ పరిస్థితుల మధ్య అమెరికా జోక్యం చేసుకుంది. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పునరుద్ధరించే దిశగా తక్షణ చర్యలను చేపట్టింది. సైనిక పాలనలోకి వెళ్లిన మియన్మార్పై కఠిన ఆంక్షలను విధించింది. మరిన్ని కఠిన ఆంక్షలు తప్పవని జో బిడెన్ హెచ్చరించారు. అంగ్సాన్ సూకీ, విన్ మియింట్ను విడుదల చేయడంతో పాటు అధికారం నుంచి తప్పుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని వెంటనే పునరుద్ధరించాలని చెప్పారు. దీనికి వారం రోజుల గడువు విధించారు. తన ఆదేశాలను పాటించకపోతే.. మరిన్ని ఆంక్షలను విధిస్తామని, ఎగుమతులను నిషేధిస్తామని తెలిపారు.
పూర్తిస్థాయి ఆంక్షలను విధించడం..
ఓ దేశంపై అమెరికా పూర్తిస్థాయి ఆంక్షలను విధించడం.. ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత ఇదే తొలిసారిగా భావిస్తున్నారు. ఇదివరకు చైనాపై విధించిన కొన్ని ఆంక్షలను కొనసాగించడానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను బిడెన్ ప్రభుత్వం జారీ చేసినప్పటికీ.. అవి పరిమితంగా ఉన్నవే. అంతకుముందు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులను కొనసాగింపజేసినవే. మియన్మార్ సైనిక ప్రభుత్వంపై విధించిన ఆంక్షలే తొలి చర్య అనే అంచనా ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా నుంచి మియన్మార్కు సరఫరా అవుతోన్న ఫార్మా, వాణిజ్యానికి సంబంధించిన ఎగుమతులను నిషేధించేలా జో బిడెన్ తదుపరి చర్యలు ఉండొచ్చని చెబుతున్నారు.