డ్రాగన్ కంట్రీకి పెద్దన్న వార్నింగ్: జిన్ పింగ్తో బైడెన్ రెండు గంటలు ఏం మాట్లాడారు..?
న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికా చైనాపై దృష్టి సారించింది. డ్రాగన్ కంట్రీ రెక్కలు విరిచేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే ముందుగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో రెండు గంటల పాటు ఫోన్లో మాట్లాడారు అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్. హాంగ్కాంగ్లో ప్రజాస్వామ్యం లేకుండా కుటిల ప్రయత్నాలు చేస్తున్న చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జో బైడెన్. ముందుగా హాంగ్కాంగ్ విషయంలో జోక్యం చేసుకోవడం మానేయాలని కోరారు. అంతేకాదు ఆర్థికపరమైన విషయాలపై కూడా జాగ్రత్తతో వ్యవహరించాలని బైడెన్ కోరినట్లు తెలుస్తోంది.
చైనాలో అమెరికా జాతీయ భద్రతా వ్యూహంపై సమీక్ష జరిపిన బైడెన్... పెంటగాన్ టాస్క్ ఫోర్స్ను పునఃసమీక్షించారు. అనంతరం పలు ప్రణాళికలను ప్రకటించారు. ఇక ఇదే సమయంలో మియన్మార్ మిలటరీ చర్యపై అసంతృప్తి వ్యక్తం చేసిన జో బైడెన్... ఆ దేశంపై ఆంక్షలు విధిస్తున్నట్లు వెల్లడించారు. చైనా అవలంబిస్తున్న మోసపూరితమైన ఆర్థిక లావాదేవీలపై అధ్యక్షుడు బైడెన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వైట్ హౌజ్ ప్రకటన విడుదల చేసింది. ఇక హాంగ్కాంగ్లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని అందుకు కారణం చైనానే అని జిన్పింగ్తో బైడెన్ సూటిగా చెప్పినట్లు తెలుస్తోంది. అమెరికా ప్రజలకు మేలు చేకూరే ప్రయోజనాలు కనిపిస్తేనే చైనాతో కలిసి పనిచేస్తామని తాను జిన్పింగ్కు చెప్పినట్లు ఫోన్ కాల్ తర్వాత బైడెన్ ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే చైనా మీడియా మాత్రం ఇరుదేశాధినేతల మధ్య చర్చలు పాజిటివ్గా ముగిశాయంటూ చెప్పుకొచ్చింది. అమెరికా చైనా దేశాల మధ్య విబేధాలున్న మాట వాస్తవమేనని అయితే వాటిని పరిష్కరించుకునేందుకు జిన్పింగ్ పిలుపునిచ్చారంటూ చైనా మీడియా పేర్కొంది. అదే సమయంలో అన్ని విషయాల్లోను సహాయసహకారాలు అందించాలని జిన్పింగ్ బైడెన్ను కోరినట్లు ఆ మీడియా కథనాలను ప్రసారం చేసింది. ఇక తైవాన్, హాంగ్కాంగ్ మరియు క్సింజియాంగ్ ప్రాంతాలపై తన వాణి వినిపించారు జిన్ పింగ్.
తైవాన్, హాంగ్కాంగ్, క్సింజియాంగ్ ప్రాంతాల్లో చైనా జోక్యం చేసుకుంటోందంటే అది చైనా అంతర్గత వ్యవహారమని, ఇతరులు ఇందులో జోక్యం చేసుకోకూడదని జిన్పింగ్ బైడెన్తో చెప్పినట్లు సీసీటీవీ అనే మరో ఛానెల్ కథనాలు ప్రసారం చేసింది. చైనా ప్రయోజనాలను అమెరికా గౌరవించి ఆమేరకు నడుచుకోవాలని జిన్పింగ్ సూచించినట్లు ఆ ఛానెల్ కథనాలు ప్రసారం చేసింది. బైడెన్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో పలు అంశాలను డీల్ చేశారు. తాజాగా గత మూడు వారాల నుంచి ఆయా దేశాల నాయకులతో మాట్లాడుతూ వస్తున్నారు.డొనాల్డ్ ట్రంప్ హయాంలో కంటే ఇతర మార్గాల్లో వెళ్లి చైనాతో ఎలా వ్యవహరిస్తామనేదానిపై సంకేతాలు పంపారు. అమెరికా - చైనా మధ్య కేవలం వాణిజ్యం-ఆర్థికపరమైన సంబంధాలపైనే ట్రంప్ వ్యవహరించారని అయితే బైడెన్ దానికి చెక్ పెట్టి ఇతర మార్గాలను అన్వేషిస్తున్నట్లు సమాచారం.