ఉత్తరకొరియా గడ్డపై కాలు మోపిన ట్రంప్..!ప్రపంచ రాజకీయాల్లో రికార్డ్ నెలకొల్పిన యూఎస్ ప్రసిడెంట్..!!
న్యూఢిల్లీ/హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరుదైన ఘనత సాధించారు. ఉత్తర కొరియా గడ్డపై అడుగుపెట్టిన తొలి అమెరికా అధ్యక్షుడిగా రికార్డు సృష్టించారు. ముందస్తు ప్రణాళిక లేకుండా ఆయన ఉత్తర కొరియాలో నేడు పర్యటించారు. కొరియా ద్వీప కల్పాన్ని విభజిస్తున్న నిస్సైనిక మండలంలో ట్రంప్ నేడు అడుగు పెట్టారు. దక్షిణ కొరియాలోని నిస్సైనిక మండలం, పన్మున్జోమ్ గ్రామం సరిహద్దుల్లో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్తో కరచాలనం చేశారు.
ఉత్తర కొరియా భూభాగంలోకి వెళ్ళడానికి ట్రంప్ కొద్దిసేపు నడిచారు. 1950-53లో జరిగిన కొరియా యుద్ధంలో ఇదే ప్రాంతంలో అమెరికా కూటమి, ఉత్తర కొరియా కూటమి దళాలు యుద్ధం చేశాయి. ట్రంప్, కిమ్ జోంగ్ ఉన్ కలిసి ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీసుకునేందుకు వీలుగా నిల్చున్నారు. అనంతరం దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్తో కలిసి వెళ్ళారు. ట్రంప్ మాట్లాడుతూ ప్రపంచానికి ఈరోజు చాలా శుభ దినమని చెప్పారు. తాను ఉత్తర కొరియా గడ్డపై కాలు మోపడం తనకు దక్కిన గౌరవమని తెలిపారు. చాలా గొప్ప విషయాలు జరుగుతున్నాయన్నారు.
కిమ్, ట్రంప్ గత ఏడాది సింగపూర్లో తొలిసారి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అణ్వాయుధాల నిర్మూలనకు స్పష్టమైన అవగాహనకు రాలేకపోయారు. వీరి రెండో సమావేశం వియత్నాంలో ఫిబ్రవరిలో జరిగింది. అనంతరం అమెరికా వైఖరిపై ఉత్తరకొరియా విమర్శలు చేసింది. అదే సమయంలో ఇరువురు నేతల మధ్య లేఖాయణం సాగింది. శనివారం ట్విటర్ వేదికగా ట్రంప్ ఉత్తర కొరియాకు ఓ ఆఫర్ ఇచ్చారు. జపాన్లోని ఒసాకాలో జరిగిన జీ20 సదస్సుకు హాజరైన ట్రంప్ ఇచ్చిన ట్వీట్లో ఉత్తర కొరియా చైర్మన్ కిమ్ దీనిని చూసినట్లయితే, నేను ఆయనను సరిహద్దుల్లో నిస్సైనిక మండలంలో కేవలం కరచాలనం చేయడానికి, హలో చెప్పడానికి కలుస్తాను అని పేర్కొన్నారు.