సైన్యాన్ని దింపిన డొనాల్డ్ ట్రంప్: రాత్రికి రాత్రి మెరుపు నిర్ణయం: తీవ్ర హెచ్చరికలు జారీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఒకవంక కరోనా విధ్వంసాన్ని సృష్టిస్తోన్నప్పటికీ.. ఆయన ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. అమెరికాలో కార్చిచ్చులా అంటుకున్న అల్లర్లను అదుపు చేయడానికి రాత్రికి రాత్రి మెరుపు నిర్ణయాన్ని తీసుకున్నారు. మిన్నెసొటాలో ఆరంభమైన అల్లర్లు రాజధాని వాషింగ్టన్ వరకూ పాకాయి. ఏకంగా అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్హౌస్ వద్ద పెద్ద ఎత్తున నిరసనల కారణం అయ్యాయి.
అండర్గ్రౌండ్లో ట్రంప్: రక్షణ కోసం బంకర్లో: మెలానియా సహా: ఆంటిఫాపై ఉగ్రముద్ర: అనూహ్యంగా
సైన్యం మోహరింపు
ఈ అల్లర్లకు ఉక్కుపాదం మోపేలా డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆందోళనకారులను నియంత్రించడానికి సైన్యాన్ని బరిలో దింపారు. యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ చట్టంలోని సెక్షన్ 1807 ప్రకారం.. ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దీనికి అవసరమైన ఉత్తర్వులపై సంతకం చేశారు. ప్రస్తుతానికి సైన్యాన్ని రాజధాని వాషింగ్టన్ డీసీకి మాత్రమే పరిమితం చేశామని, అల్లర్లు కొనసాగించాల్సి అన్ని రాష్ట్రాల్లోనూ సైన్యాన్ని మోహరింపజేయడానికి వెనుకాడబోనని హెచ్చరికలను జారీ చేశారు.
లింకన్ స్మారక మెమోరియల్, వరల్డ్ వార్-2, చర్చి ధ్వంసం
ఈ హింసాకాండను ఆయన దేశీయ ఉగ్రవాదంగా అభివర్ణించారు. దేశీయ ఉగ్రవాదానికి అమెరికాలో చోటు లేదని తేల్చి చెప్పారు. వాటిని అణచి వేయడానికి ఎలాంటి కఠిన చర్యలనైనా తీసుకుంటానని అన్నారు. అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహం లింకన్ స్మారకార్థం నిర్మించిన మెమోరియల్, వైట్హౌస్ సమీపంలో గల చారిత్రాత్మక చర్చి, రెండో ప్రపంచ యుద్ధం స్మారక కట్టడాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు.
స్మారక కట్టడాలపై దాడుల పట్ల..
దీని పట్ల డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని, సైన్యాన్ని బరిలో దింపడానికి ప్రదర్శనకారులు విధ్వంసానికి పాల్పడటమే ప్రధాన కారణమని వైట్హౌస్ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ అల్లర్లు క్రమంగా దేశీయ ఉగ్రవాదంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులను ఉపేక్షించబోమని అన్నారు. అల్లర్లు నియంత్రణలోకి రాకపోతే 50 రాష్ట్రాల్లో శాంతిభద్రతలను సైన్యానికి అప్పగిస్తామని అన్నారు.
జార్జ్ ఫ్లాయిడ్ హత్యతో..
ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతం అనంతరం అమెరికాలోని పలు నగరాలు అగ్నిగుండాలుగా తయారయ్యాయి. ఆ దేశంలో నివసించే ఆఫ్రికన్ అమెరికన్లందరూ ఏకం అయ్యారు. వ్యతిరేక ప్రదర్శనలు, నిరసనలతో అట్టుడికిస్తున్నారు. జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతం అనంతరం అమెరికాలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ఈ ప్రదర్శనలు చాలాచోట్ల హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల విధ్వంసానికి దారి తీసింది.
Recommended Video
వైట్హౌస్ వద్ద మిన్నంటిన నిరసనలు
మూడురోజులుగా అమెరికా వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. వైట్హౌస్ పరిసరాల్లో టియర్ గ్యాస్ ప్రయోగించడాన్ని అసాధారణ చర్యగా అభివర్ణిస్తున్నారు. దీని ఫలితంగా డొనాల్డ్ ట్రంప్ అండర్గ్రౌండ్ బంకర్లోకి వెళ్లాల్సి వచ్చింది. అధ్యక్షుడి రక్షణ కోసం వైట్హౌస్ కింద వాటిని నిర్మించారు. మిస్సైళ్లను సంధించినా చెక్కుచెదరని విధంగా ఆ బంకర్లు నిర్మితం అయ్యాయి. ఎప్పటికప్పుడు వాటిని బలోపేతం చేయడానికి అమెరికా ప్రభుత్వం బడ్జెట్ను సైతం కేటాయిస్తుంటుంది.