చైనాతో ఫేస్ టు ఫేస్: భారత్ భాగస్వామ్యం లేకుండా అసాధ్యమంటోన్న ట్రంప్: కీలక భేటీ వాయిదా
వాషింగ్టన్: కరోనా వైరస్కు జన్మనిచ్చినట్టుగా భావిస్తోన్న చైనాతో అమెరికా ఫేస్ టు ఫేస్కు రెడీ అవుతోంది. ఆ దేశాన్ని ఇరుకున పెట్టడానికి వ్యూహాత్మకంగా పావులను కదుపుతోంది. ఇప్పటికే ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యపరమైన యుద్ధం నడుస్తోంది. అమెరికాతో తాము ప్రచ్ఛన్న యుద్దం అంచుల్లో నిల్చున్నామని చైనా విదేశాంగ శాఖ మంత్రి సైతం స్పష్టం చేశారంటే పరిస్థితి ఎక్కడిదాకా వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ప్రస్తుత కష్టకాలంలో చైనాకు అండగా ఉంటోందనే ఒకే ఒక్క కారణంతో అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్థతో తెగదెంపులను చేసుకోవడానికి సైతం వెనుకాడలేదు.
Recommended Video
భారత్ వైపే అమెరికా..
అదే చైనా ప్రస్తుతం భారత్తోనూ కయ్యానికి కాలు దువ్వుతోంది. లడక్ సమీపంలో భారత సరిహద్దుల్లో పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరింపజేసింది. యుద్ధ సామాగ్రిని తరలించింది. భారత్తో చాలాకాలం నుంచి నడుస్తోన్న సరిహద్దు వివాదాలను తెగే దాకా లాగడానికి ప్రయత్నిస్తోందనే ఆరోపణలను ఎదుర్కొంటోంది చైనా. ఈ విషయంలో ఒకింత భారత్ వైపే మొగ్గు చూపుతోంది అమెరికా. అమెరికా, చైనా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని చల్లార్చడానికి తాను మధ్యవర్తిత్వాన్ని వహిస్తానని స్పష్టం చేసింది. దీనికి చైనా అంగీకరించలేదు.
చైనా టార్గెట్గా..
ఇదిలావుండగా.. చైనాను వ్యూహాత్మంగా బలహీనపర్చడానికి అమెరికా భారత్ సహకారాన్ని కోరుకుంటోంది. భారత్ సహకారం లేనిదే చైనాను ధీటుగా ఎదుర్కొనలేమనే భావనకు వచ్చింది. మనదేశంతో పాటు రష్యా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాల మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఆయా దేశాలన్నీ కరోనా వైరస్ పాలిట పడి తీవ్రంగా దెబ్బతిన్నవే. అందుకే చైనాను దెబ్బకొట్టడానికి ఆ దేశాల నుంచి కూడా మద్దతును కోరుకుంటోందనేది స్పష్టమౌతోంది. దీనికోసం అమెరికా.. జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సులో భారత్ను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించుకుంది.
మారబోతోన్న జీ7 అజెండా
నిజానికి- జీ7 దేశాల జాబితాలో భారత్కు చోటు లేదు. బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికా మాత్రమే ఈ కూటమిలో ఉన్నాయి. తరచూ సమావేశమౌతుంటాయి. దౌత్యపరమైన కీలక నిర్ణయాలను తీసుకుంటుంటాయి. ఉగ్రవాద నిర్మూలన, వాణిజ్య సంబంధాల బలోపేతం, అభివృద్ధిపరమైన కీలక నిర్ణయాలను ఈ ఏడు దేశాలు తీసుకుంటూ ఉంటాయి. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. ఈ సారి దీనికి భిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయని భావిస్తోంది అమెరికా. చైనాతో సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో.. జీ7 శిఖరాగ్ర సదస్సులో దీన్ని ప్రస్తావనకు తీసుకుని రానుంది.
భారత్ సహా మరిన్ని దేశాల భాగస్వామ్యం కోసం
భారత్ సహా రష్యా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాలను ఇందులో భాగస్వామ్యులను చేయనుంది. దీనికోసం జూన్లో నిర్వహించాల్సిన ఈ జీ7 శిఖరాగ్ర సదస్సును ఏకంగా వాయిదా వేసింది. ఈ సమావేశాన్ని సెప్టెంబర్లో నిర్వహించబోతున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ సారి భారత్ సహా రష్యా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాలను ఈ సమావేశంలో భాగస్వామ్యం చేస్తామని అన్నారు. వారిని ప్రత్యేక ఆహ్వానితులుగా గుర్తిస్తామని ట్రంప్ వెల్లడించారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశానికి ముందు గానీ లేదా తరువాత గానీ జీ7 శిఖరాగ్ర సదస్సును నిర్వహిస్తామని తెలిపారు.