కీలక ఘట్టం... ముఖాముఖి డిబేట్కు సిద్దమైన ట్రంప్-బైడెన్... అందరి కళ్లు అటువైపే...
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టానికి రంగం సిద్దమైంది. మరికొద్ది గంటల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ మొట్టమొదటి ముఖాముఖి చర్చా కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందులో 15 నిమిషాలకో సెగ్మెంట్ చొప్పున మొత్తం ఆరు సెగ్మెంట్లు ఉండనున్నాయి. ప్రముఖ జర్నలిస్ట్,టీవీ వ్యాఖ్యాత క్రిస్టఫర్ వాలెస్ ఈ చర్చా కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరించనున్నారు.ఇద్దరి మధ్య ఎలాంటి అంశాలు ప్రస్తావనకు రానున్నాయి.. ఎలాంటి సవాళ్లు విసురుకోనున్నారు తదితర అంశాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
ఏయే అంశాలపై చర్చ...
కరోనా వైరస్,ఆర్థిక స్థితి గతులు,సుప్రీం కోర్టు,వ్యక్తిగత రికార్డులు,ఎన్నికల సమగ్రత,జాతి వివక్ష-హింస తదితర అంశాలపై ఈ చర్చా కార్యక్రమంలో ట్రంప్,బైడెన్ తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. కార్యక్రమ వ్యాఖ్యాతగా వీలైనంతవరకు తాను పారదర్శకంగానే వ్యవహరిస్తానని వాలెస్ అన్నారు. అమెరికాలో అధ్యక్ష పదవికి పోటీ పడే అభ్యర్థులు ఎన్నికలకు ముందు ఇలా మూడుసార్లు ముఖాముఖి బహిరంగ చర్చల్లో పాల్గొంటారు. ట్రంప్-బైడెన్ మధ్య మరో రెండు చర్చలు అక్టోబర్ 15,22 తేదీల్లో జరగనున్నాయి. ప్రముఖ వార్తా సంస్థలు సీ స్పాన్,ఎన్బీసీ వీటిని నిర్వహిస్తాయి.
1960 నుంచి మొదలైన ఆనవాయితీ...
అమెరికాలో అధ్యక్ష పదవి కోసం అభ్యర్థులు ముఖాముఖి చర్చల్లో పాల్గొనే ఆనవాయితీ 1960లో మొదలైంది. అమెరికా చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగిన తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్లో జాన్ ఎఫ్ కెనడీ,రిచర్డ్ నిక్సాన్ పాల్గొన్నారు. సెప్టెంబర్ 26,1960న జరిగిన ఆ సమావేశం అన్ని టీవీ చానెళ్లలో ప్రసారమైంది. ఆ ఏడాది ఇద్దరు కలిసి మొత్తం 4 డిబేట్లలో పాల్గొన్నారు. అప్పటినుంచి అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో డిబేట్ల అధ్యయనానికి తెరలేచింది.
Recommended Video
ప్రెసిడెన్షియల్ డిబేట్ కమిషన్ ఆధ్వర్యంలో
ఈ డిబేట్లను పక్షపాతం లేకుండా నిర్వహించేందుకు 1987లో ప్రెసిడెన్షియల్ డిబేట్ కమిషన్(సీపీడీ) కూడా ఏర్పాటైంది. ఈ సంస్థ ప్రభుత్వం నుంచి గానీ,రాజకీయ పార్టీల నుంచి గానీ నిధులు సేకరించదు. ఇది స్వతంత్రంగా పనిచేస్తుంది. ముఖాముఖి బహిరంగ చర్చల్లో నాయకుల సత్తా,ప్రణాళికలు,వారి ఆలోచనలు ప్రజలకు తెలియజేయడమే ప్రెసిడెన్షియల్ డిబేట్ల ముఖ్య ఉద్దేశం. అధ్యక్ష అభ్యర్థుల మధ్య డిబేట్ తరహాలోనే ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న అభ్యర్థుల మధ్య కూడా ఇలాంటి డిబేట్ జరుగుతుంది. అక్టోబర్ 7న డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్,ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ మధ్య ఈ డిబేట్ జరగనుంది.