భారత్, చైనాలను బూచిగా చూపి ట్రంప్ సంచలన నిర్ణయం: విమర్శల వర్షం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. భూతాపం నియంత్రణకు అనుగుణంగా 2015లో కుదుర్చుకున్న ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు గురువారం ప్రకటించారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. భూతాపం నియంత్రణకు అనుగుణంగా 2015లో కుదుర్చుకున్న ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు గురువారం ప్రకటించారు. ట్రంప్ నిర్ణయంతో ప్రపంచ పర్యావరణానికి తీవ్ర విఘాతం వాటిల్లినట్లయింది. ట్రంప్ వైఖరిపై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రముఖ నటుడు షాట్జ్ నెగ్గర్, అమెరికా ప్రజలతోపాటు తోపాటు పలుదేశాలు తీవ్రంగా మండుతున్నాయి.
ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలగడానికి భారత్, చైనాలను బూచిగా చూపే ప్రయత్నం చేశారు ట్రంప్. సదరు ఒప్పందం అమెరికా ఆర్థిక వ్యవస్థకు నష్టదాయకమని, ఉద్యోగ, ఉపాధి రంగాలను దెబ్బతీస్తుందన్నారు. భారత్, చైనాలాంటి దేశాలకు మాత్రం ఇది అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. అమెరికాకు మేలు చేయని ఏ ఒప్పందం విషయంలోనైనా తమ వైఖరి ఇలాగే ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు.
కాగా, పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడానికి గల కారణాలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాలుగు దేశాల నేతలకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి మరీ చెప్పినట్లు శ్వేతసౌధ వర్గాలు వెల్లడించాయి. కానీ ఈ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు నిర్ణయం తీసుకున్న తర్వాత ఫోన్ చేశారా..? తీసుకోకముందే ఫోన్ చేశారా..? అనే దానిపై మాత్రం శ్వేతసౌధ వర్గాలు స్పష్టతనివ్వలేదు.
'జర్మనీ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మానుయేల్ మేక్రాన్, కెనడియన్ అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో, యూకె ప్రధాని థెరిస్సా మేలతో ట్రంప్ వ్యక్తిగతంగా ఫోన్ చేసి మరీ మాట్లాడారు.అట్లాంటిక్ కూటమికి కట్టుబడి ఉందని, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన తగిన నిర్ణయాలు తీసుకుంటామని ఈ నాలుగు దేశాధినేతలకు ఫోన్లో సంభాషించినపుడు హామీ ఇచ్చారు. అమెరికా పరిశుభ్రమైన, అత్యంత పర్యావరణ అనుకూల దేశమని ట్రంప్ ఉద్ఘాంటించారు' అని తెలిపింది.
కాగా, పారిస్ వాతావరణ ఒప్పందానికి తాము కట్టుబడి ఉంటామని ఆ నాలుగు దేశాల నేతలు ట్రంప్తో చెప్పినట్లు శ్వేతసౌధం వెల్లడించింది. జీ7 సదస్సుకు హాజరైనపుడు పారిస్ ఒప్పందానికి కట్టుబడి ఉండమని ట్రంప్ను ఒప్పించేందుకు ప్రపంచ దేశాధినేతలు ప్రయత్నించినా, ఫలితం లేకపోయింది.
ట్రంప్ నిర్ణయంతో పర్యావరణ పరిరక్షణకు పెను విఘాతం ఏర్పడిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచంలోనే అత్యధిక కాలుష్యానికి కారణమవుతున్న దేశాల్లో అమెరికాది రెండో స్థానం కావడం గమనార్హం.
ఒప్పందం
రోజు రోజుకు పెరిగిపోతున్న భూతాపాన్ని నియంత్రించేందుకు గానూ 2015లో ప్యారిస్ లో ప్రపంచ దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం భూగోళపు సగటు ఉష్ణోగ్రతలను 2 డిగ్రీల సెల్సియస్ కన్నా కింది స్థాయికి తగ్గించాలి. సంతకం పెట్టకపోయినప్పటికీ కూడా అమెరికా ఒప్పందంలో కొనసాగుతోంది. కాగా, మొత్తం 187 దేశాలు ఈ ఒప్పందంపై సంతకం చేశాయి. తాము అధికారంలోకి వస్తే ఈ ఒప్పందం నుంచి ట్రంప్ వైదొలుగుతామని స్ఫష్టం చేశారు. ఇప్పుడు అలాగే చేశారు.