జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి హత్య: అమెరికా సంచలన నివేదిక - సౌదీ రాజుకు తెలిసే..!
న్యూయార్క్ : 2018లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్యకు సంబంధించి ఇంటెలిజెన్స్ నివేదికను అమెరికా బహిర్గతం చేసింది. అమెరికా విడుదల చేసిన ఈ నివేదికలో షాకింగ్ అంశాలు వెలుగు చూశాయి. ఇంతకీ అమెరికా విడుదల చేసిన రిపోర్టులో ఏముంది..? జో బైడెన్ ఎందుకు ఆ నివేదికను బహిర్గతం చేయాల్సి వచ్చింది...?
సౌదీ రాజు ఆదేశాల మేరకే ఖషోగ్గి హత్య
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు జాతీయ అంతర్జాతీయ అంశాలపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే 2018లో హత్యకు గురైన ప్రముఖ జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి హత్యకు సంబంధించిన ఇంటెలిజెన్స్ నివేదికను అమెరికా ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నివేదికలో జమాల్ ఖషోగ్గిని హత్యకు పెద్ద కుట్రే జరిగిందని.. ఈ కుట్రలో సౌదీ యువరాజు మొహ్మద్ బిన్ సల్మాన్ హస్తం ఉందని తేల్చింది.
సౌదీ రాజు మొహ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలతోనే ఖషోగ్గిని అంతమొందించారని ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడించింది. అయితే ఐదువారాల క్రితం జమాల్ ఖషోగ్గి హత్యకు సంబంధించిన నివేదికను తాను చదివి ఆ తర్వాత మొహ్మద్ బిన్ సల్మాన్ తండ్రితో మాట్లాడదామని బైడెన్ భావించారట. ఇదే విషయాన్ని వైట్ హౌజ్ సెక్రటరీ జెన్ సాకి వెల్లడించారు. అంతేకాదు ఈ నివేదిక విడుదల చేస్తున్నారంటే అది అమెరికా రాజ్యాంగంను అనుసరించి అదే సమయంలో బైడెన్ విధానాలను అనుసరించి మాత్రమే రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. సంప్రదాయమైన పద్ధతిలో సౌదీ అమెరికా దేశాల మధ్య సంబంధాలు నెలకొనేలా ప్రయత్నాలు సాగుతాయని వెల్లడించారు.
కేసులో ఐదుగురికి మరణశిక్ష
అతిపెద్ద ఆయిల్ ఉత్పత్తి దేశంగా గుర్తింపు ఉన్న సౌదీ అరేబియా ట్రంప్ హయాంలో నాలుగేళ్ల పాటు అమెరికాతో స్నేహం కొనసాగించింది. వాషింగ్టన్ పోస్టు కాలమిస్టుగా పనిచేస్తున్న జర్నలిస్టు ఖషోగ్గి టర్కీలోని ఇస్తాంబుల్లో ఉన్న సౌదీ కాన్సులేట్ వద్ద హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత తన మృతదేహాన్ని కూడా మాయం చేశారు.
అయితే ఈ హత్యకు పాల్పడిన వారికి సౌదీ రాజు మొహ్మద్ బిన్ సల్మాన్కు సంబంధం ఉందని తేలింది. డిసెంబర్ 2019లో సౌదీ ప్రభుత్వం ఈ కేసుకు సంబంధించి ఐదుగురికి మరణశిక్ష విధించగా మరో ముగ్గురికి జైలు శిక్ష విధించింది. అయితే ఖషోగ్గి హత్యలో కచ్చితంగా సౌదీ రాజు సల్మాన్ హస్తం ఉందని నాడు మీడియా బలంగా అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే ఖషోగ్గి హత్యకు రాజుకు ఎలాంటి సంబంధం లేదని హంతకులు తీసుకున్న నిర్ణయం, పక్కా ప్రణాళిక ప్రకారమే ఖషోగ్గిని హత్య చేశారని ప్రభుత్వం చెప్పుకొచ్చింది.
స్పష్టమైన ఆధారాలు లేవు
ఇదిలా ఉంటే ఖషోగ్గి హత్య పట్లా తాను విచారం వ్యక్తం చేస్తున్నట్లు సెప్టెంబర్ 2019లో రాజు మొహ్మద్ బిన్ సల్మాన్ చెప్పారు. అంతేకాదు తన హయాంలోనే అది జరిగింది కనుక తానే బాధ్యత తీసుకుంటానని సల్మాన్ ప్రకటించారు. ఇక ఖషోగ్గి పిల్లల అభ్యర్థన మేరకు నిందితులకు క్షమాభిక్ష పెట్టి మరణ శిక్ష పడ్డ ఐదుగురికి ఆ శిక్షను రద్దు చేస్తూ దాన్ని 20 ఏళ్ల జైలు శిక్ష కింద మార్చడం జరిగింది.
అయితే ఖషోగ్గి హత్యతో బిన్ సల్మాన్కు సంబంధం ఉందని చెప్పేందుకు ఎక్కడా ఆధారాలు లభించలేదు. ఇక ట్రంప్ హయాంలో ఖషోగ్గి హత్యకు సంబంధించి రిపోర్టును విడుదల చేయాలని పలు మానవహక్కుల సంఘాల నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి వచ్చినప్పటికీ ఆ సమయంలో ట్రంప్ నివేదిక విడుదల చేయలేదు. అయితే బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న కొన్ని వారాల్లోనే ఈ నివేదికను విడుదల చేసి తన పారదర్శకతను చాటుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.