హెచ్1బీపై క్లారిటీ.. అలాంటి నిర్ణయం తీసుకోలేదన్న అగ్రరాజ్యం..
వాషింగ్టన్ : భారత్, అమెరికా మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో హెచ్1బీ వీసాలపై అగ్రరాజ్యం పరిమితి విధించనుందన్న వార్తలు వచ్చాయి. దీనిపై ఆందోళనలు వెల్లువెత్తడంతో ట్రంప్ యంత్రాంగం క్లారిటీ ఇచ్చింది. హెచ్ 1బీ వీసాల పరిమితిని తగ్గించే ప్లాన్ లేదని స్పష్టం చేసింది. డేటా స్టోరేజ్ విషయంలో తలెత్తిన వివాదంతో ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పింది. అయితే బై అమెరికన్, హైర్ అమెరికన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో భాగంగా వర్క్ వీసా ప్రోగ్రాంను సమీక్షించాలని నిర్ణయించామే తప్ప ప్రత్యేకంగా ఒక దేశాన్ని టార్గెట్ చేసేలా ఎలాంటి చర్యలు తీసుకోమని స్పష్టం చేసింది. ఈ వ్యవహారానికి డేటా స్టోరేజ్కు సంబంధం లేదని తేల్చిచెప్పింది.
చితికిపోయిన పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ..! పాక్ సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తి వ్యాఖ్యలు..!!
Recommended Video
డేటా స్టోరేజ్పై అభ్యంతరం
గత కొంతకాలంగా పన్నుల విషయంలో భారత్, అమెరికా మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. దీనికి తోడు ఏప్రిల్ 2018లో ఆర్బీఐ ఓ సర్క్యులర్ జారీ చేసింది. చెల్లింపుల వ్యవస్థలకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఇండియాలోని సర్వర్లలో మాత్రమే స్టోర్ చేయాలని అందులో స్పష్టం చేసింది. విదేశాల్లో ఎలాంటి మిర్రర్ డేటా ఉండరాదని తేల్చి చెప్పింది. సాధారణంగా ఇంటర్నేషనల్ కంపెనీలు కస్టమర్ డేటాను అంతర్జాతీయ సర్వర్లలో నిల్వ చేస్తుంటాయి. కానీ ఆర్బీఐ ఆదేశాలతో ఆయా కంపెనీలు స్థానికంగా సర్వర్లు ఏర్పాటు చేసేందుకు అదనపు పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. దీంతో అమెరికన్ ఐటీ, ఈ కామర్స్ కంపెనీలు ఈ నిబంధనను వ్యతిరేకిస్తున్నాయి.
అమెరికా టిట్ ఫర్ టాట్
డేటా స్టోరేజ్కు సంబంధించి భారత్ నిర్ణయానికి ప్రతిగా అమెరికా వీసా పరిమితులు విధించనుందన్న వార్తలు వస్తున్నాయి. అగ్రరాజ్యం వాటిని ఖండించినా... ఒకవేళ అమెరికా హెచ్1బీ వీసాలపై పరిమితి విధిస్తే 150 బిలియన్ డాలర్ల విలువైన ఇండియా ఐటీ సెక్టార్పై పెను ప్రభావమే పడుతుంది. అమెరికాలో తమ క్లయింట్లున్న ప్రాంతాలకు భారత ఐటీ కంపెనీలు ఈ వీసాల ద్వారానే తమ ఉద్యోగులను పంపుతుంటాయి. ఏటా 85వేల హెచ్1బీ వీసాలు జారీ అవుతుండగా.. వాటిలో 70శాతం భారతీయులే దక్కించుకుంటున్నారు.
అమెరికాకే నష్టం
టెక్నాలజీ నిపుణులకు ఇచ్చే వీసాలకు సంబంధించి దేశాలవారీగా పరిమితులు విధిస్తే అది అమెరికన్ కంపెనీలకే నష్టమని విశ్లేషకులు అంటున్నారు. ఈ చర్య ద్వారా నైపుణ్యం కలిగిన పనివారు లేక అక్కడి కంపెనీలు బలహీనపడతాయని నాస్కామ్ అభిప్రాయపడింది. 2017లో హెచ్ 1బీ వీసాల్లో అత్యధికం భారత టెక్కీలకే దక్కాయి. విదేశాల నుంచి వలస వస్తున్న ముఖ్యంగా భారత్, చైనా నుంచి వచ్చిన నిపుణుల వల్లే అమెరికా ఇంటర్నేషనల్ టెక్నాలజీ లీడర్గా ఎదిగింది. ఇప్పుడు దేశాలవారీగా ఆంక్షలు విధిస్తే వ్యాపార సంస్థలకు నిపుణులు దొరకక నష్టాలు మూటగట్టుకుంటాయని నాస్కామ్ అంటోంది.