చైనా యాప్స్పై భారత్ నిషేధం... భేష్ అంటూ అమెరికా ప్రశంసలు...
భారత్లో టిక్టాక్ సహా 59 చైనా యాప్స్పై నిషేధం విధించడంపై అమెరికా స్పందించింది. చైనా యాప్స్ను నిషేధించడం భారత సమగ్రత,సార్వభౌమత్వాన్ని కాపాడుతుందని,జాతీయ భద్రతను పరిరక్షిస్తుందని పేర్కొంది. ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో బుధవారం(జూలై 1) ఒక ప్రకటన చేశారు.
భారత్ చైనా యాప్స్పై నిషేధం విధించిన మరుసటి రోజే అమెరికా కూడా చైనాకు చెందిన హువావే,జెడ్టీఈ కంపెనీలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ రెండు కంపెనీలతో జాతీయ భద్రతకు ముప్పు పొంచి ఉందన్న కారణంతో.. ఈ సంస్థల నుంచి చేసే కొనుగోళ్లపై నిషేధం విధించింది. యూనివర్సల్ సర్వీస్ ఫండ్ నుంచి 8.3బిలియన్ డాలర్లతో ఈ సంస్థల నుంచి కొనుగోలు చేసే పరికరాలపై నిషేధం విధించింది.
ఇటు భారత్ కూడా ప్రభుత్వ రంగ సంస్థలైన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్), మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్(ఎంటీఎన్ఎల్) కంపెనీలు మార్చిలో జారీచేసిన 4జీ అప్గ్రేడేషన్ టెండర్ను రద్దు చేసింది. వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా వస్తువులను కొనుగోలు చేయవద్దన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో హువావే,జెడ్ఈటీలకు ఈ ప్రాజెక్టులో చోటు దక్కదు.
ఇక బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ చైనీస్ సోషల్ మీడియా యాప్ వీబో నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు చైనా మాత్రం భారత్ నిర్ణయాలను తప్పు పడుతోంది. చైనా యాప్స్పై నిషేధం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిబంధనలకు విరుద్దం అని చెబుతోంది. ఈ నేపథ్యంలో మున్ముందు ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఎలా ఉంటాయన్న ఉత్కంఠ నెలకొంది.