భారత పైలట్ల దెబ్బ, అమెరికా లక్షలకోట్ల డీల్పై ప్రభావం! పాక్ ఎఫ్ 16 ఉపయోగంపై పెద్దన్న ఆందోళన
వాషింగ్టన్: పుల్వామా దాడి అనంతరం, పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ ఎయిర్ ఫోర్స్ దాడి చేయడం, ఆ తర్వాత పాక్కు చెందిన యుద్ద విమానాలు.. భారత సైనిక స్థావరాన్ని టార్గెట్ చేయడం, దీనిని భారత్ తిప్పికొట్టడం తెలిసిందే. భారత్ మిలటరీ స్థావరాలను టార్గెట్ చేసేందుకు పాకిస్తాన్.. అమెరికా నుంచి కొనుగోలు చేసిన అత్యాధునిక ఎఫ్ 16 విమానాన్ని ఉపయోగించింది.
భారత్ పాతకాలపు మిగ్ 21 విమానంతో అత్యాధునిక విమానాన్ని కూల్చింది. దీంతో భారత పైలట్లు అభినందన్, సిద్ధార్థలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పాతకాలపు మిగ్ విమానలతో అత్యాధునిక ఎప్ 16 విమానాన్ని కూల్చడం సాధారణ విషయం కాదని చెబుతున్నారు. ఇది పాకిస్తాన్తో పాటు అమెరికాకు కూడా మింగుడుపడని విషయం. ఈ నేపథ్యంలో తమ ఎఫ్ 16 విమానాల వినియోగంపై సమాచారం కావాలని పెద్దన్న అమెరికా.. పాక్ను అడిగింది.
ఎఫ్ 16 విమానం కూలడంపై పాక్ నుంచి సమాచారం అడిగిన అమెరికా
కుప్పకూలిన రెండు విమానాల్లో ఒకటి భారత్ మిగ్ కాగా, రెండోది పాకిస్తాన్కు చెందిన ఎఫ్ 16 విమానం. అయితే రెండో విమానం కూడా భారత్దేనని పాక్ వాదిస్తూ వచ్చింది. కానీ ఇందుకు సంబంధించిన ఆధారాలను ఇండియా చూపించింది. పాకిస్తాన్ కొనుగోలు చేసిన అమెరికన్ మేడ్ ఎఫ్ 16 అంటూ ఆధారలను మూడు రోజుల క్రితం చూపించింది. అత్యాధునిక అమెరికాకు చెందిన విమానాన్ని భారత్ పాత కాలపు విమానాలతో కూల్చిందంటే అమెరికా ఎలా స్పందిస్తుందోననే పాకిస్తాన్.. అవాస్తవాలు చెప్పినట్లుగా తెలుస్తోంది. అందుకే, అసలు తాము ఎఫ్ 16 విమానాలనే ఉపయోగించలేదని చెప్పింది. కానీ భారత్ ఆధారాలు చూపించడంతో పాకిస్తాన్ ఏం చేయలేకపోయింది. దీంతో అసలు తమ విమానం (ఎఫ్ 16) కూలిపోవడంపై సమాచారం ఇవ్వాలని అమెరికా.. పాక్ను అడిగింది.
మరింత సమాచారం సేకరిస్తున్నాం
తాము మరింత సమాచారం సేకరిస్తున్నామని స్టేట్ డిపార్టుమెంట్ స్పోక్స్పర్సన్ చెప్పారు. పాక్ - అమెరికా మధ్య ఎఫ్ 16 కొనుగోలుకు సంబంధించి ఒప్పందాలు ఉన్నాయని, కాబట్టి అన్ని వివరాలు చెప్పలేమని అమెరికా అధికారులు చెబుతున్నారు.
అమెరికా వ్యాపారంపై ప్రభావం?
ఇక, కాశ్మీర్లో ఇటీవల జరిగిన భారత్ పాక్ యుద్ధవిమానాల మధ్య జరిగిన పోరాటం అమెరికా వ్యాపారంపై భారీగా ప్రభావం చూపనుందనే వాదనలు వినిపిస్తున్నాయి. భారత్ పైన దాడి కోసం... పాకిస్థాన్ అమెరికాలోని లాక్హీడ్ మార్టిన్ సంస్థ తయారు చేసిన ఎఫ్ 16ను ఉపయోగించింది. ఈ పోరులో భారత్కు చెందిన పాతకాలపు యుద్ధ విమానం మిగ్ 21 బైసన్.. పాక్కు చెందిన ఎఫ్ 16ను నేలకూల్చింది. తొలుత పాక్ దీనిని అంగీకరించలేదు. కానీ ఎఫ్ 16 కూలిందనడానికి సరిపడా ఆధారాలు ఒక్కోటిగా వచ్చాయి. ఈ ఘటన లాక్హీడ్ మార్టిన్ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
సమాచారం ఇవ్వాలని కోరడం వెనుక లక్షల కోట్ల కారణం
అమెరికాలో ప్రయివేటు సంస్థలే రక్షణ రంగ ఉత్పత్తులను తయారు చేస్తాయి. అందులో లాక్హీడ్ మార్టిన్ పెద్దది. ప్రపంచంలోనే ఈ సంస్థ అత్యధికంగా ఆయుధాలను విక్రయిస్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తాజాగా కాశ్మీర్లో ఎఫ్ 16 వాడినట్లు వార్తలు రావడంపై అమెరికా మండిపడింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని పాక్ను కోరింది. దీని వెనుక దాదాపు రూ.1.4లక్షల కోట్ల విలువైన కారణముందని చెబుతున్నారు.
భారత్కు ఎఫ్ 21 సరఫరా చేయాలని చూస్తున్న లాక్హీడ్
114 మీడియం మల్టీ రోల్ యుద్ధవిమానాలను కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. భూతల, గగనతల లక్ష్యాలపై దాడి చేయగల సామర్థ్యం గల వాటిని కొనాలను చూస్తోంది. రాఫెల్, మిరాజ్ 2000 ఈ కేటగిరీకి చెందినవే. యుద్ధ విమానాలు కొనేందుకు భారత్ ఆరు నమూనాలు పరిశీలిస్తోంది. ఇందులో మిగ్, డసో, లాక్హీడ్ మార్టిన్, బోయింగ్ సంస్థలు ఉన్నాయి. ఇందులో లాక్హీడ్ సంస్థ ఎఫ్ 21ను భారత్కు సరఫరా చేయాలని చూస్తోంది. ఇదే లాక్హీడ్కు చెందిన ఎఫ్ 16ను పాకిస్తాన్ ఇటీవల ఉపయోగించి, విఫలమైంది. ఇటీవల ప్రదర్శించింది కూడా. అయితే ఇప్పుడు, ఓ పాత మిగ్ విమానం ఆధునిక ఎఫ్ 16ను కూల్చి వేయడంతో తమపై ప్రభావం పడుతుందని లాక్హీడ్ ఆందోళన చెందుతోందట. ఇది లాక్హీడ్కు భారీ షాక్ అంటున్నారు.