ప్రతి పౌరుడి ఖాతాలో రూ. 91వేలు.. ట్రంప్ ప్యాకేజీకి సెనేట్ ఆమోదం..
ప్రపంచ పెద్దన్నగా వ్యవహరించే అమెరికా ప్రస్తుతం కరోనా విలయంలో చిక్కుకుపోయింది. బుధవారం నాటికి ఆ దేశంలో వైరస్ బారినపడి చనిపోయినవారి సంఖ్య 1000 దాటింది. పాజిటివ్ కేసుల సంఖ్య 70వేలకు పెరిగింది. దేశవ్యాప్త లాక్డౌన్కు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నో చెప్పడంతో ఆయా రాష్ట్రాల స్థానిక ప్రభుత్వాలు ఎక్కడికక్కడ షట్ డౌన్ ప్రకటిస్తున్నాయి. దేశరాజధాని వాషింగ్టన్ లో సైతం అత్యవసర సేవలు తప్ప మిగతా సర్వీసులన్నీ దాదాపు నిలిచిపోయాయి. వైరస్ కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు ట్రంప్ రూపొందించిన ప్యాకేజీకి అమెరికా కాంగ్రెస్ ఎగువ సభ అయిన సెనేట్ ఆమోదం తెలిపింది.
దేశంలోని కార్మికులు, వ్యాపారస్తులు, వైద్యసిబ్బందితోపాటు అన్ని వర్గాలకు లబ్ధి చేకూరేలా ప్రెసిడెంట్ ట్రంప్ మొత్తం రెండు లక్షల ట్రిలియన్ డాలర్ల (దాదాపు 1500 లక్షల కోట్ల రూపాయల) విలువైన ప్యాకేజీని ప్రతిపాదించారు. అందులో భాగంగా 500 బిలియన్ డాలర్లను పరిశ్రమలకు ఉద్దీపనంగా, దేశంలోని ప్రతి పౌరుడి ఖాతాలో 1200 డాలర్లు (రూ.91 వేలు) జమచేసేలా, చిన్నపిల్లలు ప్రతి ఒక్కరికి 500 డాలర్లు (సుమారు రూ.38వేలు) ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించారు. అమెరికా చరిత్రలోనే భారీ ఉద్దీపన చర్యగా పేరుపొందిన ఈ బిల్లుపై బుధవారం సెనేట్ లో సుదీర్ఘ చర్చ జరిగింది. ఆ తర్వాత..
90-0 తేడా మెజార్టీతో ట్రంప్ బిల్లను సెనేట్ ఆమోదించింది. దీంతో ఈ బిల్లు దిగువ సభ అయిన 'హౌజ్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్(ప్రతినిధుల సభ)'కు వెళ్లనుంది. శుక్రవారం ప్రతినిధుల సభలో దీనిపై చర్చ, ఓటింగ్ జరుగుతుంది. అక్కడ కూడా ఆమోదం లభించిన వెంటనే సదరు కరోనా ప్యాకేజీ బిల్లుపై ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. తద్వారా అది చట్టంగా అమల్లోకి వస్తుంది. అగ్రరాజ్యం అమెరికా కరోనా ఉద్దీపన ప్యాకేజీ కింద 1500 లక్షల కోట్లు ప్రకటించగా, అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారత్ లో గురువారమే రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే.