‘భారతీయులకు అమెరికా వీసాలివ్వొద్దు’: టాప్ సెనెటర్
వాషింగ్టన్: రానున్న కాలంలో భారతీయులకు అమెరికా వీసాలు రావడంలో ఇక్కట్లు తప్పేలా లేవు. వీసాల విషయంలో తాజాగా, అత్యున్నత స్థాయి అమెరికన్ సెనేటర్ ఒకరు భారత్ సహా 23 దేశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక, ఈ దేశాలకు ఇమ్మిగ్రెంట్, నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలను జారీ చేయవద్దని డిమాండ్ చేశారు.
చట్టవిరుద్ధ వలసదారులను అమెరికా నుంచి వెనక్కు రప్పించేందుకు ఈ దేశాలు అమెరికాకు సహకరించడం లేదని ఆరోపించారు. రిపబ్లికన్ సెనేటర్, సెనేట్ జ్యుడిషియరీ కమిటీ చైర్పర్సన్ చక్ గ్రాస్లీ హోంల్యాండ్.. సెక్యూరిటీ కార్యదర్శి జెహ్ జాన్సన్కు రాసిన లేఖలో ఈ డిమాండ్ చేశారు.
ప్రమాదకరమైన నేరస్థులు, హంతకులు ప్రతి రోజూ విడుదలవుతున్నారని, వారిని తిప్పి పంపడానికి వారి స్వదేశాలు సహకరించడం లేదని గ్రాస్లీ తన లేఖలో ఆరోపించారు. 2014 ఆర్థిక సంవత్సరంలోనే 2,166 మంది విడుదలయ్యారని, అంతకుముందు రెండేళ్ళలో 6,100 మందిని విడుదల చేశారని తెలిపారు.
ప్రస్తుతం సహకరించని దేశాలుగా 23 దేశాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. వీటిలో మొదటి 5 స్థానాల్లో క్యూబా, చైనా, సోమాలియా, భారతదేశం, ఘనా ఉన్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని పలుమార్లు గుర్తు చేసినట్లు తెలిపారు. కాగా, అమెరికా ఇమ్మిగ్రేషన్స్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ మరో 62 దేశాల వివరాలను పరిశీలిస్తోంది.
ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ చట్టంలో సెక్షన్ 243(డి)ని చేర్చేటపుడు ఈ సమస్యను అమెరికా కాంగ్రెస్ ప్రస్తావించిందని గ్రాస్లీ పేర్కొన్నారు. ఈ దేశాలు తమ పౌరుడు, జాతీయుడు, నివాసిని తమ దేశానికి తీసుకెళ్ళడంలో సహకరించలేదని అన్నారు.
అంతేగాక, అసాధారణంగా జాప్యం చేస్తున్నాయని హోం ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ నోటీసు ఇస్తే, ఇమ్మిగ్రెంట్, నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాల జారీని నిలుపుదల చేయవచ్చునని ఈ సెక్షన్ చెబుతోందని గుర్తు చేశారు. దీనిని 2001లో గయానా విషయంలో మాత్రమే అమలు చేశారన్నారు. ఫలితంగా గయానా రెండు నెలల్లోనే సహకరించడం ప్రారంభించిందన్నారు. ఈ నేపథ్యంలో వీసాల అంశంపై అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.