అమెరికాలో కాల్పులు: ముగ్గురు మృతి, పలువురికి గాయాలు
న్యూయార్క్: అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం 9 గంటలకు హార్ఫర్డ్ కౌంటీలోని పెరీమాన్ ప్రాంతంలో ఉన్న ఓ ఫార్మసీ కేంద్రం దగ్గర ఈ కాల్పులు జరిగాయి.
ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, మరికొందరు గాయపడినట్లు అధికారులు పేర్కొన్నారు. కాల్పులకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వ్యక్తి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉంది.
స్థానికులు ఆ ప్రాంతంలో సంచరించొద్దని అధికారులు హెచ్చరించారు. 'ఇకపై ఎలాంటి భయం ఉండదనే మేం అనుకుంటున్నాం' అని స్థానిక అధికారి ఒకరు ట్వీట్ చేశారు.
కాల్పులు జరిగినట్లు సమాచారం అందిన కొన్ని నిమిషాల్లోనే ఎఫ్బీఐ అధికారులు అక్కడికి చేరుకున్నారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని బయటకు విడుదల చేయలేదు. ఆ కాల్పుల వెనకున్న కారణాలు తెలియాల్సి ఉంది.