ఎఫ్-16 యుద్ధ విమానం దుర్వినియోగంపై వివరణ ఇవ్వండి: పాకిస్తాన్కు అమెరికా చీవాట్లు
అమెరికాలో తయారైన ఎఫ్-16 యుద్ధ విమానాలను దుర్వినియోగం చేసినందుకు పాకిస్తాన్కు అమెరికా ప్రభుత్వం చీవాట్లు పెట్టిందా అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది.పుల్వామా దాడుల తర్వాత ప్రతీకారచర్యల్లో భాగంగా భారత్ బాలాకోట్లో మెరుపుదాడులు జరిపి ఉగ్రవాద శిబిరాలను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరుసటి రోజు భారత్ పైకి పాక్ యుద్ధవిమానాలు దాడులు చేసేందుకు ప్రయత్నించగా పాక్కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానంను భారత బలగాలు కూల్చేశాయి.
అమెరికాలో తయారైన ఎఫ్ -16 యుద్ధ విమానంను పాకిస్తాన్ దుర్వినియోగం చేసిందని మండిపడుతూ ఈ మేరకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కు ఆగష్టులో అప్పటి అమెరికా ఉన్నతాధికారిగా ఉన్న ఆండ్రియా థాంప్సన్ లేఖ రాసినట్లు అమెరికా మీడియా కథనాలు ప్రచురించింది. అయితే ప్రత్యేకించి ఫిబ్రవరి ఘటనను మాత్రం ఎక్కడ చెప్పకుండానే పాకిస్తాన్కు చీవాట్లు పెట్టినట్లు అమెరికా మీడియా కథనాలు రాసుకొచ్చింది.
ఇదిలా ఉంటే ఫిబ్రవరిలో జరిగిన డాగ్ఫైట్ సందర్భంగా పాకిస్తాన్ ఎఫ్-16 యుద్ధ విమానాలను వినియోగించిందని భారత్ చెబుతోంది. అయితే భారత్ చెబుతున్నది అవాస్తవమని పాకిస్తాన్ పేర్కొంది. అంతేకాదు అభినందన్ వర్థమాన్ కమాండింగ్ చేసిన మిగ్-బైసన్ 21ను తమ సైన్యం కూల్చేసిందని పాక్ చెప్పుకొచ్చింది. అయితే ఆ రోజు జరిగిన ఘటనలో భారత సైన్యం పాక్ యుద్ధ విమానం నుంచి జారవిడిచిన ఆమ్రామ్ క్షిపణి శకలాలను రాజౌరీ సెక్టార్లో స్వాధీనం చేసుకుంది. ఈ క్షిపణి ఎఫ్-16లో మాత్రమే వినియోగిస్తారని దీనిబట్టి పాక్ ఎఫ్-16 యుద్ధ విమానం వినియోగించిందని భారత ఆర్మీ అధికారులు అప్పుడే ధృవీకరించారు.
ఇదిలా ఉంటే అనుమతి లేని చోట్లు అమెరికా తయారు చేసిన ఎఫ్-16 యుద్ధ విమానాలను పాక్ వినియోగించడాన్ని తీవ్రంగా తప్పుబడుతూ అప్పటి ఉన్నతాధికారి ఆండ్రియా థాంప్సన్ పాకిస్తాన్ను మందలించారు. పాకిస్తాన్ కొనుగోలు చేసే సందర్భంలో చేసుకున్న నిబంధనలను ఉల్లంఘించిందని ఆమె మండిపడ్డారు. పాక్ ఇలా చేయడం వల్ల తమ టెక్నాలజీకి బహిర్గతం అవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే థాంప్సన్ రాసిన లేఖపై స్పందించేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం నిరాకరించింది.