చైనాతో యుద్ధ వాతావరణంపై అమెరికా ఫుల్ క్లారిటీ: ట్రంప్ నోట అదే మాట: అతి పెద్ద సమస్యగా
వాషింగ్టన్: లఢక్ సమీపంలో భారత్-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాలు, ఘర్షణలు, రెండు దేశాల సైనికుల మధ్య చోటు చేసుకున్న దాడులు, ప్రతిదాడుల పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోరు విప్పారు. ఈ రెండు దేశాల మధ్య చెలరేగిన ఉద్రిక్త పరిస్థితులను తగ్గించడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వాన్ని వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని ట్రంప్.. పరోక్షంగా వెల్లడించారు. ఈ దిశగా ఇప్పటికే భారత్తో మాట్లాడామని, చైనాతో చర్చించడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు.
Recommended Video
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల మధ్య అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనడానికి డొనాల్డ్ ట్రంప్.. వాషింగ్టన్ నుంచి ఓక్లహామాకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన వైట్హౌస్లో క్లుప్తంగా విలేకరులతో మాట్లాడారు. భారత్-చైనా మధ్య నెలకొన్న యుద్ధపూరక వాతావరణంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. మధ్యవర్తిత్వాన్ని వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ పరోక్షంగా స్పష్టం చేశారు. ఆసియాలోని రెండు ప్రధాన దేశాలైన భారత్-చైనా మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులను అతిపెద్ద సమస్యగా ట్రంప్ అభివర్ణించారు.
భారత్ చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తొలిరోజుల్లోనే అమెరికా చొరవ తీసుకున్న విషయం తెలిసిందే. ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాలను పరిష్కరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, దీనికోసం మధ్యవర్తిత్వాన్ని వహించడానికి వెనుకాడబోమని ట్రంప్ వెల్లడించారు. దీన్ని అటు చైనా, ఇటు భారత్ రెండూ తిరస్కరించాయి. భారత్తో సరిహద్దు వివాదాలు తమ అంతర్గత విషయాలని, ఇందులో మరొకరి జోక్యాన్ని తాము అంగీకరించబోమని చైనా తేల్చి చెప్పింది. భారత్ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.
సరిహద్దుల్లో భారత ఆర్మీ, చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) మధ్య చోటు చేసుకున్న ప్రాణాంతక దాడుల అనంతరం మరోసారి అమెరికా మధ్యవర్తిత్వం అనే ప్రతిపాదనను తెరమీదికి తీసుకుని రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఘర్షణలు, పరస్పర దాడుల్లో రెండు దేశాల తరఫున 65 మంది సైనికులు మరణించినట్లు తేలింది. దీనితో యుద్ధ వాతావరణం నెలకొంది. బలమైన రెండు ఆసియా దేశాల మధ్య ఈ తరహా పరిస్థితులు ఏర్పడటం సరికాదని తాజాగా ట్రంప్ స్పష్టం చేశారు. ఉద్రిక్తతలను చల్లార్చడానికి తాము చేయాల్సిందతా చేస్తామని అన్నారు.